. . . ఇన్ పుట్ డీలర్ల శిక్షణ తరగతులను ప్రారంభించిన కలెక్టర్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
రైతాంగ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వం వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ ఫర్ ఇన్పుట్ డీలర్స్ (DAESI)” కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇన్ పుట్ డీలర్లకు సూచించారు. తద్వారా ఉపాధి అవకాశాలను మెరుగుపర్చుకోవడంతో పాటు రైతాంగానికి సరైన విధంగా తోడ్పాటును అందించగల్గుతారని అన్నారు. డిచ్పల్లి మండలం బర్దీపూర్ రైతు వేదికలో ఇన్ పుట్ డీలర్లకు ఏడాది పాటు నిర్వహించనున్న డిప్లొమా కోర్సు శిక్షణా తరగతులను కలెక్టర్ మంగళవారం లాంచనంగా ప్రారంభించారు. ఈ ఏడాది మొదటి బ్యాచ్ లో శిక్షణ కోసం ఎంపికైన 40 మంది ఇన్ పుట్ డీలర్లను కలెక్టర్ పేరుపేరునా ప్రతి ఒక్కరిని పరిచయం చేసుకున్నారు. ఈ డిప్లొమా కోర్సులో చేరడానికి గల కారణాలను, వారి ఆసక్తి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వ్యవసాయ ఆధారిత ప్రాంతమైనందున నిజామాబాద్ జిల్లా పరంగా చూస్తే ఈ డిప్లొమా కోర్సు శిక్షణ కార్యక్రమం ఎంతో ప్రాధాన్యతతో కూడుకుని ఉందన్నారు. వివిధ రకాల పంటల సాగులో క్రిమిసంహారక మందులు, విత్తనాల వినియోగంపై శాస్త్రవేత్తలు, వ్యవసాయ నిపుణులు శిక్షణ అందించడం జరుగుతుందన్నారు. ఈ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి డిప్లొమా కోర్సు సర్టిఫికేట్ అందించడం జరుగుతుందని తెలిపారు. వారు పెస్టిసైడ్స్ డీలర్ షాపును ఏర్పాటు చేసుకోవడంతో పాటు రైతులకు సరైన విధంగా, సరైన మోతాదులో పెస్టిసైడ్స్ కోసం అవగాహన కల్పిస్తారన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ శిక్షణ అందజేస్తోందని అన్నారు. ఎరువులు, క్రిమిసంహారక మందులు, విత్తనాల వాడకంలో తగిన పరిజ్ఞానం లేక అనేక మంది రైతులు పెట్టుబడులు నష్టపోవడం, దిగుబడులు కోల్పోవడం జరుగుతుందన్నారు. ఈ పరిస్థితిని నిలువరించేందుకు ఇన్ పుట్ డీలర్లు డిప్లొమా కోర్సులో బోధించే అంశాలను చక్కగా ఆకళింపు చేసుకుని, క్షేత్రస్థాయిలో రైతులను చైతన్యపరుస్తూ వారికి వెన్నుదన్నుగా నిలువాలని కలెక్టర్ సూచించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పంట మార్పిడి విధానం అవలంభించేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. శిక్షణా తరగతుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆత్మ పథక సంచాలకులు తిరుమల ప్రసాద్, సహాయ సంచాలకులు దైవగ్లోరి, డిప్లొమా కోర్సు శిక్షణ కార్యక్రమం సమన్వయకర్త డి.అమరేశ్, రైతు శిక్షణ కేంద్రం డీ.డీ పద్మావతి తదితరులు పాల్గొన్నారు.


