నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యం
. . . ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి
బోధన్, బతుకమ్మ :
బోధన్ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు పి. సుధర్శన్ రెడ్డి అన్నారు. బోధన్ పట్టణంలో మంగళవారం నూతనంగా ఏర్పాటు చేసిన డయాలిసిస్ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం, మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరో ముందడుగు పడిందని, డయాలిసిస్ సెంటర్ ప్రారంభంతో కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. తదుపరి, బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద అమృత్ 2.0 పథకం కింద రూ.50 కోట్ల వ్యయంతో చేపట్టనున్న తాగునీటి సరఫరా పనులకు, అలాగే యూఐడీఎఫ్ నిధులతో రూ.18.70 కోట్ల అంచనాతో స్టార్మ్ వాటర్ డ్రెయిన్లు, రహదారులు, కల్వర్ట్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే బృందం ప్రెస్ కాలనీ, శక్కర్నగర్ రామలీలా మైదానం, పాత పట్టణం (ఓల్డ్ టౌన్) ప్రాంతాలను సందర్శించి, అక్కడ నిర్మించనున్న నూతన వాటర్ ట్యాంకుల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ పనుల ద్వారా పట్టణంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో బోధన్ సబ్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, డీఈ & ఏఈ (బోధన్), స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
