బతుకమ్మ, ఏర్గట్ల : ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న నూనె శ్రీనిధి, ఎనిమిదవ తరగతి చదువుతున్న పెరక రాజేష్ ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా వారు నిర్వహించిన అంతర్జాతీయ బాలసాహిత్య బేరి శతాధిక బాల కవుల సాహిత్య సదస్సులో పాల్గొని చక్కని ప్రతిభను కనబరిచి ప్రశంసా పత్రాలు అందుకున్నారు. అంతర్జాతీయ పరంగా జరిగిన ఈ కార్యక్రమంలో వందమంది విద్యార్థులకు ఈ అవకాశం కల్పించగా అందులో ఏర్గట్ల ఉన్నత పాఠశాల నుండి ఇద్దరు విద్యార్థులు ప్రతిభను కనబరిచి పెద్దల ప్రశంసలు పొంది, ఈ కార్యక్రమానికి అర్హత సాధించారు. నవంబర్ 30వ తేదీన అంతర్జాలంలో జరిగిన సాహిత్య సభలో నూనె శ్రీనిధి చక్కని కవిత్వం వినిపించగా, పెరక రాజేష్ అద్భుతమైన పద్యాలు పాడి పెద్దల మన్ననలు పొందారు. వీరికి తానా సంఘం వారు ప్రోత్సాహకమైన ప్రశంసా పత్రాలు అందించారు. పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొమరగిరి కృష్ణాచారి ఈ ప్రశంస పత్రాలను విద్యార్థులకు అందజేశారు. అంతర్జాతీయ పరంగా పాఠశాల గొప్పతనాన్ని తెలియజేస్తున్న విద్యార్థులను, వారిని ప్రోత్సహిస్తున్న తెలుగు పండితులు ప్రవీణ్ కుమార్ శర్మ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మునిరుద్దీన్, ప్రసాద్, రాజశేఖర్, విజయ్, శ్రీనివాస్, గంగాధర్, రాజనర్సయ్య, నరేష్, ట్వింకిల్, సమత, కృష్ణవేణి, రిషిక తదితరులు పాల్గొన్నారు.
