. . . అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ
నిజామాబాద్ సిటి, బతుకమ్మ :
భారతమాత భజన పరివార్ ఇందూర్ నిర్వహిస్తున్న ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో సానుకూల మార్పుకు దారి తీస్తాయని యువతలో భక్తి, సేవా భావం పెంపొందిస్తామని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. శ్రీ లింగేశ్వర గుట్ట ఆశ్రమంలో భారతమాత భజన మండలిఇందూర్ వారి ఆధ్వర్యంలో కార్తీక మాస వన భోజన మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆశ్రమాధిపతులు శ్రీ శ్రీ శ్రీ బాలయోగి కృష్ణ మహారాజ్, శ్రీ శ్రీ శ్రీ మధుసూదన నంద సరస్వతి మహారాజ్ లు నేతృత్వం వహించి భక్తులకు ఆధ్యాత్మిక బోధనలు అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొని సభను ఉద్దేశించి ప్రసంగించారు. కుటుంబ వ్యవస్థను పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.. “ధర్మో రక్షిత రక్షిత:” ధర్మాన్ని మనం కాపడితే ధర్మం మనల్ని కాపాడుతుందని, హిందూ సనాతన ధర్మం పరిరక్షణలో మహిళల పాత్ర ఎంతో ముఖ్యమైనదని తెలిపారు. మన హిందూ ధర్మం ఎంతగా పెరుగుతుందో దానికి హిందూ వ్యతిరేక శక్తులు కూడా అంతగా తయారవుతున్నాయని, దీన్ని పసిగట్టి మన హిందూ ధర్మ ప్రచారానికి నారీశక్తి ముందువరుస లో ఉండాలని సూచించారు. అనంతరం శ్రీ శ్రీ శ్రీ పిట్ల కృష్ణ మహారాజ్, శ్రీ శ్రీ శ్రీ మధుసూదన నంద సరస్వతి మహారాజ్ సనాతన ధర్మంపై లోతైన ప్రవచనాలు ఇచ్చి భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శనం అందించారు. మహారాజుల ఉపదేశాలతో భక్తులందరూ మనోనిగ్రహం, భక్తి, సేవా స్పూర్తి సూత్రాలను ఆచరణలో పెట్టాలనే సంకల్పం వ్యక్తం చేశారు. భజన పరివార్ సభ్యులు చేసిన భజనలు, హారతులు, జపాలు గుట్ట అంతటా పవిత్రతను నింపాయి.కార్యక్రమ విజయవంతం కోసం కృషి చేసిన నిర్వాహక భక్తులకు, సేవకులకు అందరికీ మహారాజులు ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో నిర్వహకులు వైట్ల.సుబ్బారావ్, ప్రముఖ వక్త.లక్ష్మణరావు, సుబేదార్, గణేష్, గంగా కిషన్, కాపర్తి గురుచరణ్, బీజేపీ నాయకులు మాజీ కార్పొరేటర్ ప్రభాకర్, మఠం పవన్, మారవార్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

