నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగరంలో జిల్లా లీగల్ మెట్రోలజీ అధికారుల తనిఖీలు పలు దుకాణాలలో ఆకస్మాత్తుగా గురువారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని గంగస్థాన్ ఫేస్-1 ప్రాంతంలో శ్రీరామ గార్డెన్ ఎదురుగా ఉన్న ఎస్ఎంఎన్ఆర్ వైన్స్ పర్మిట్ రూంలో నిబంధనలకు విరుద్ధంగా లేబుల్ లేకుండా, ఎమ్.ఆర్.పీ రేట్లు లేకుండా వాటర్ బాటిళ్లు విక్రయిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదు ఆధారంగా జిల్లా లీగల్ మెట్రోలజీ అధికారులు దాడి చేశారు. తనిఖీ సందర్భంగా సంబంధిత దుకాణంలో వాటర్ బాటిళ్లపై చట్టప్రకారం ఉండవలసిన మాన్యుఫ్యాక్చరర్ వివరాలు, ప్యాకింగ్ తేదీ, ఎమ్.ఆర్.పీ వంటి వివరాలు లేకుండా విక్రయించినట్లు అధికారులు గుర్తించారు. ఈ చర్యలు ప్యాకేజ్డ్ కమోడిటీస్ (డిక్లరేషన్ అండ్ ప్రైసింగ్) నిబంధనలకు విరుద్ధం అని పేర్కొన్నారు. అనంతరం గాంధీ చౌక్ సమీపంలో ఉన్న గిరీష్ గార్మెంట్స్ బట్టల షాపులో నిబంధనలకు విరుద్ధంగా ప్యాక్ చేసిన బట్టలపై ప్రైస్ ట్యాగ్ లేకుండా విక్రయాలు జరుగుతున్నట్లు వచ్చిన ఫిర్యాదు ఆధారంగా తనిఖీ నిర్వహించారు. తనిఖీ సందర్భంగా సంబంధిత షాపులో చట్టప్రకారం ఉండవలసిన ధర ట్యాగ్లు, తయారీదారు వివరాలు, ప్యాకింగ్ తేదీ వంటి వివరాలు లేని బట్టలను విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా లీగల్ మెట్రాలజీ విభాగ అధికారులు మాట్లాడుతూ, “గ్రాహకులను తప్పుదోవ పట్టించే ఇలాంటి ఉల్లంఘనలపై ఎవరూ ఉపేక్షించబడరు. చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటాం” అని తెలిపారు.
