- ఎంసీహెచ్, క్రిటికల్ కేర్ యూనిట్ లను ప్రారంభించనున్న మంత్రి
- ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్
నిజామాబాద్, బతుకమ్మ : ఈనెల 22న రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ జిల్లాకు రానున్నారు. జిల్లా కేంద్రంలో నూతనంగా రూ.38.78కోట్లతో నిర్మించిన మాతాశిశు సంరక్షణ (ఎంసీహెచ్), క్రిటికల్ కేర్ యూనిట్ లతో కూడిన భవన సముదాయాన్ని మంత్రి ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఎంసీహెచ్ భవన సముదాయాన్ని శుక్రవారం సందర్శించి ప్రారంభోత్సవ ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జీ+4 అంతస్థులతో కూడిన ఈ భవన సముదాయంలో అందుబాటులోకి తెస్తున్న వివిధ విభాగాలను సందర్శించి, అధికారులకు పలు సూచనలు చేశారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ప్రారంభోత్సవానికి పక్కాగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. వివిధ అంతస్థులలో నెలకొల్పిన ఆయా విభాగాలకు సంబంధించిన వివరాలు స్పష్టంగా తెలిసేలా బోర్డులను ఏర్పాటు చేయించాలని ఆదేశించారు. భవన సముదాయం లోపల, బయట పరిసర ప్రాంతాలలో ఎక్కడ కూడా చెత్తాచెదారం లేకుండా చక్కగా శుభ్రం చేయించాలని అన్నారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిని డాక్టర్ రాజశ్రీ, జిల్లా జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమరాజ్, ఇంజనీరింగ్ విభాగం అధికారి ప్రవీణ్, వైద్యాధికారులు ఉన్నారు.

