నిజామాబాద్, బతుకమ్మ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 40 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఏసీపీ రాజా వెంకట్ రెడ్డిలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, ఫిర్యాదులను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
- పదవీ విరమణ చేస్తున్న ఎస్.ఐ కు సన్మానం..
కలెక్టరేట్ లో విధులు నిర్వర్తిస్తూ, ఈ నెల 30న పదవీ విరమణ చేస్తున్న పోలీస్ సబ్ ఇన్స్ పెక్టర్ ఏం.డీ.నసీరుద్దీన్ ను ఘనంగా సన్మానించారు. ఆయనను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి పూల మాలలు, శాలువాతో సత్కరించి జ్ఞాపికను బహూకరించారు. నసీరుద్దీన్ అందించిన సేవలను కొనియాడారు.
