. . . విశ్వ విద్యాలయ ఉపకులపతి టి. యాదగిరిరావు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
మహిళా చైతన్యం గ్రామాల నుండి మొదలవ్వాలని అప్పుడే నిజమైన మహిళా సాధికారత సాధ్యమవుతుందని తెలంగాణ విశ్వ విద్యాలయ ఉపకులపతి టి.యాదగిరి రావు అన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయ విమెన్ సెల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వర్సిటీ ఉపకులపతి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ముందుండాలని వారికి కుటుంబం, మహిళా సంఘాలు, ప్రభుత్వం చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు. రిజిస్ట్రార్ ఆచార్య ఎం.యాదగిరి మాట్లాడుతూ స్త్రీ పురుషులు పరస్పర సహకారంతో ముందుకెళ్లినప్పుడే మంచి అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొంటూ సమాజ అభివృద్ధికి మహిళ కీలకమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విమెన్ సెల్ డైరెక్టర్ డాక్టర్ భ్రమరాంబిక, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ రాంబాబు, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఆరతి, న్యాయ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రసన్న రాణి, వివిధ విభాగాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

