- త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి
నిజామాబాద్ ప్రతినిధి, బతుకమ్మ: వికసిత్ భారత్ నిర్మాణ ప్రక్రియలో దేశ యువతది, ముఖ్యంగా మహిళా విద్యార్థుల పైనే ఉందని త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి అన్నారు. మంగళవారం నగరంలో పర్యటించిన ఆయన కంటేశ్వర్ లోని ఉమెన్స్ మహిళా కళాశాలలో జరిగిన ఓ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్సీసీ మహిళా విద్యార్థులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, ప్రధాని మోడీ వికసిత్ భారత్ వైపు అడుగులు వేస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్క యువత బాధ్యతగా ఉండి కీలకంగా పని చేయాలన్నారు. సమాజంలో తల్లిదండ్రులకు తమ వారసులు ఐఏఎస్ లు, ఐపీఎస్ లు, ఇతర ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడాలని కోరుకుంటారని వారి కోరిక వాస్తవానికి నిజమే అయినప్పటికీ తమ

పిల్లలకు ఏ రంగంలో ఆసక్తి ఉందో ఏ విద్య చదువుతారో ఆ విద్యను చదివిస్తే భవిష్యత్తులో మంచి ప్రయోజకులుగా తయారవుతారని ఆయన అన్నారు. అటు కేంద్ర ప్రభుత్వం కూడా మహిళల విద్యపై ఎన్నో అవకాశాలు కల్పిస్తుందని విద్యార్థులే ఓ మినీ సబ్జెక్టును తయారు చేసేలా మారగలుగుతారని ఆయన అన్నారు. అలాగే ఉమెన్స్ కళాశాల అనేది మహిళల కోసమే నిర్మించిన కళాశాల అని ఎంతో చారిత్రాత్మక పురాతనమైన కళాశాల ఈ కళాశాల అని అన్నారు. ఈ కళాశాలలో చదివిన విద్యార్థులు ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఎదిగారని ఆయన కొనియాడారు. అలాగే మహిళా విద్యార్థులు క్రీడల్లో కూడా రాణించాలని ఆయన అన్నారు అనంతరం ఉమెన్స్ ఎడ్యుకేషన్ సొసైటీ సభ్యులు గవర్నర్ ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, ఉమెన్స్ ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి, సెక్రెటరీ కృపాకర్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ పద్మనాభరెడ్డి, ప్రిన్సిపల్ భారతి తదితరులు పాల్గొన్నారు.

