- గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులు 68 మంది
- టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థులు 16
కరీంనగర్, బతుకమ్మ : కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానాలకు దాఖలైన నామినేషన్ల ఉపసంహరణ గడువు బుధవారంతో ముగిసింది. ఈ నెల 10 వరకు నామినేషన్లను స్వీకరించగా గ్రాడ్యుయేట్ స్థానానికి 100 మంది టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 17 మంది నామినేషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 11న నామినేషన్ల పరిశీలనలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి వేసిన 32 నామినేషన్లను తిరస్కరించారు. అదే విధంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి దాఖలైన 17 నామినేషన్లలో ఒకదానిని తిరస్కరించారు. బుధవారం నామినేషన్ల ఉపసంహరణ ఉండగా ఎవరు కూడా తమ అభ్యర్థిత్వాలను పోటీ నుంచి ఉపసంహరించుకోలేదని ఎన్నికల అధికారి పమేల సత్పతి తెలిపారు. ఈ నేపథ్యంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి 68 మంది, టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో 16మంది బరిలో నిలబడడం ఖాయమైంది. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా బీఆర్ఎస్ నుంచి ఎవరు నామినేషన్లు వేయలేరు. అయితే కరీంనగర్ మాజీ మేయర్ సర్ధార్ రవీంధర్ సింగ్ స్వతంత్రంగా నామినేషన్లు వేయడంతో ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగానే పరిగణలోకి తీసుకోనున్నారు. ప్రధాన పార్టీలను వదిలేస్తే ఎక్కువ భాగం స్వతంత్రులే పట్టభద్రుల నియోజకవర్గం అభ్యర్థులుగా బరిలో నిలిచినట్లయింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ విషయానికొస్తే పీఆర్ టీయూ, బీజేపీ , వామపక్షాల అభ్యర్థులు మధ్య పోటీ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. స్వతంత్రంగా ఉపాధ్యాయులు కూడా బరిలో ఉండడంతో ఏయే అభ్యర్థికి ఎసరు వస్తుందోనని చర్చ మొదలయింది.