. . . నిర్లక్ష్యం వహిస్తున్న కాంట్రాక్టర్
. . . ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు, వాహనదారులు
రుద్రూర్, బతుకమ్మ :
రోడ్డు నిర్మాణ పనులు మూడు నెలలు గడుస్తున్నా ముందుకు సాగడం లేదని, దింతో రైతులు, వాహనదారులు తీవ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రుద్రూర్ మండలంలోని రాణంపల్లి గ్రామ శివారు నుండి పంట పొలాలకు వెళ్లే మెటల్ రోడ్డు నిర్మాణానికి రూ.50 లక్షలతో గత మూడు నెలల క్రితం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ స్థానిక నాయకులతో కలిసి భూమి పూజ చేశారు. మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు మెటల్ రోడ్డు నిర్మాణ పనులను మొదలు కూడా పెట్టలేదని, “రోడ్డు నిర్మాణ పనులు పూర్తయ్యేదేన్నడోనని” రైతులు వాపోతున్నారు. ఈ రోడ్డు పనులు పూర్తయితే పంట పొలాలకు వెళ్లే రైతులకు, వాహనదారులకు సులభంగా ఉంటుందని రైతులు పేర్కొన్నారు.
కాంట్రాక్టర్ వివరణ :
రుద్రూర్ మండలం రాణంపల్లి గ్రామంలో రూ.50 లక్షలతో చేపడుతున్న మెటల్ రోడ్డు నిర్మాణ పనులను ఇంకా ప్రారంభించలేదని, ఎప్పుడు మొదలు పెడుతారని కాంట్రాక్టర్ శ్రీకాంత్ కు చరవాణిలో వివరణ కోరగా, పైపులు ఆర్డర్ ఇచ్చామని, కల్వర్టులు వేశాక, రోడ్డు పనులు మొదలు పెడుతామని సమాధానమిచ్చారు. మెటల్ రోడ్డు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రైతులు కోరారు.

