ఎడపల్లి, బతుకమ్మ : కుటుంబ కలహాల కారణంగా భర్త భార్యను హత్య చేసిన ఘటన ఎడపల్లి మండలంలోని ఎంఎస్సీ ఫారం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఎంఎస్సీ ఫారం గ్రామానికి చెందిన షేక్ హుస్సేన్, ఆసియా బేగం(40) భార్యాభర్తలు. గురువారం సాయంత్రం వారి ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కోపానికి గురైన హుస్సేన్ తన భార్య ఆసియా బేగం తలను గోడకు బలంగా బాదడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. తన భార్య మృతి చెందిందని గమనించి భయపడ్డ హుస్సెన్, ఆసియా బేగం అనారోగ్యంతో మృతి చెందిందని స్థానికులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశాడు. అయితే భార్య బంధువులు ఘటన స్థలానికి చేరుకొని అబద్ధాన్ని బయటపెట్టడంతో అసలు విషయం వెలుగు చూసింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఎడపల్లి పోలీసులు ఆసియా బేగం బంధువుల ఫిర్యాదుతో నిందితుడు షేక్ హుస్సెన్ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
