- వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ టి.యాదగిరి రావు
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు, తల్లిదండ్రులు అధ్యాపకుల పరిచయ కార్యక్రమానికి ప్రొఫెసర్ సిహెచ్ ఆరతి అధ్యక్షత వహించగా వైస్- ఛాన్స్లర్ ప్రొఫెసర్ టి యాదగిరిరావు ముఖ్యఅతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్స్లర్ టి.యాదగిరిరావు మాట్లాడుతూ తెలంగాణ విశ్వవిద్యాలయం లో ఇంజనీరింగ్ కళాశాల సుదీర్ఘ స్వప్నమని పేర్కొన్నారు. ఈ స్వప్నాన్ని ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులు, విద్యావంతుల, మీడియా మిత్రుల కోరిక మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి జీవో నెంబర్ 32 ద్వారా తెలంగాణ విశ్వవిద్యాలయానికి ఇంజనీరింగ్ కళాశాల కల నెరవేర్చినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంజనీరింగ్ కళాశాల మంజూరు గురించి పలుమార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోయానని ఈ ప్రాంతంలో బడుగు బలహీన వర్గాలకు ఇంజనీరింగ్ విద్యను అందించేందుకు తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు అనుమతించారని పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరం నుండి ఇంజనీరింగ్ లో జాయిన్ అయినా విద్యార్థిని విద్యార్థులకు అడ్వాన్సడ్ సాంకేతికపరమైన బోధనా పద్ధతులతో నాణ్యమైన, నైపుణ్యాన్ని అభివృద్ధి పరిచే విద్యను అందిస్తామని ప్రభుత్వనిబంధనల మేరకు అందరికీ హాస్టల్ వసతి కల్పిస్తానని హామీ ఇచ్చారు. ప్రతిష్టాత్మక మైన ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు కృషి చేసిన ఈ ప్రాంత శాసనమండలి సభ్యులు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కి, ముఖ్యమంత్రి సలహాదారు షబ్బీర్ కి, స్థానిక శాసనసభ్యులు ఏ భూపతి రెడ్డి కి, సుదర్శన్ రెడ్డి కి, మదనమోహన్ రావు కి, పోచారం శ్రీనివాస్ రెడ్డి కి ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ఇంజనీరింగ్ కళాశాల మంజూరులో సాంకేతికంగా సహకరించిన తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్, ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి కృషిని ప్రశంసించారు. ఈ సమావేశంలో ప్రొఫెసర్ నందిని, ప్రొఫెసర్ అతిక్ సుల్తాన్ గోరి, ప్రొఫెసర్ భ్రమరాంబిక, ప్రొఫెసర్ నీలిమ,విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు టీచింగ్,నాన్ -టీచింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

