. . . టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
. . . సికింద్రాబాద్లో టీఆర్ఎస్ జెండా పండుగ
హైదరాబాద్, బతుకమ్మ :
ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందుబాటులో లేకపోవడం రాష్ట్రంలోని ప్రధాన సమస్యగా మారిందని, టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే పేదల జేబు నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా ఉచిత విద్య, ఉచిత వైద్యం అందిస్తామని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హామీ ఇచ్చారు. తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) జెండా పండుగ సందర్భంగా బుధవారం సికింద్రాబాద్లోని సీతాఫల్ మండిలో కల్వకుంట్ల కవిత పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆమె పార్టీ లక్ష్యాలు, రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలపై విస్తృతంగా మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లకు పైగా గడిచినా పేదలు, మధ్యతరగతి ప్రజల జీవితాల్లో ఆశించిన మార్పు రాలేదని కవిత పేర్కొన్నారు.

ఆ పరిస్థితిని మార్చాలనే సంకల్పంతోనే తెలంగాణ రక్షణ సేనను స్థాపించామని తెలిపారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన కవిత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయలేదని ఆరోపించారు. పెన్షన్ల పెంపు, కొత్త ఇళ్ల పంపిణీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి హామీలు నెరవేర్చకుండా మళ్లీ ప్రజల మద్దతు కోరడం సమంజసం కాదని వ్యాఖ్యానించారు. విద్యార్థులు ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం ఇబ్బందులు పడుతుంటే, మూసీ అభివృద్ధి కోసం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని ప్రభుత్వం చెప్పడం సరైన ప్రాధాన్యత కాదని విమర్శించారు.

అలాగే డిగ్రీలు పూర్తి చేసిన యువతకు ఉద్యోగాలు లభించని పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, స్వయం ఉపాధి కోసం రూ.2 లక్షల నుంచి రూ.20 కోట్ల వరకు రుణాలు అందించే విధానాన్ని అమలు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు విద్య, వైద్యం, ఉపాధి వంటి అంశాలపై సరైన దృష్టి పెట్టలేదని కవిత విమర్శించారు. ముఖ్యంగా పేదలు, రోజువారీ కూలీలు, మధ్యతరగతి కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన ఉద్యమకారుల పాత్రను గుర్తు చేసిన కవిత, వారికి ప్రభుత్వం తగిన గౌరవం ఇవ్వడం లేదని ఆరోపించారు. ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తామని ఇచ్చిన హామీ అమలు కాలేదని పేర్కొంటూ, ఉప్పల్ భగాయత్లో ప్రభుత్వ భూమిని ఉద్యమకారులకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పార్టీ సిద్ధాంతాలను వివరిస్తూ, శ్రీకృష్ణుడి శంఖం “పాంచజన్యం” పేరును ఆదర్శంగా తీసుకుని ఐదు ప్రధాన అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేసే నాయకులు, కార్యకర్తలకే పార్టీలో గౌరవం ఉంటుందని చెప్పారు. చివరగా, “మీ ఆడబిడ్డగా మీ కోసం పార్టీ పెట్టాను. ఒక మహిళకు అవకాశం ఇచ్చి ఆశీర్వదించండి. ప్రజల ఆశీర్వాదంతో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకొస్తాం” అని కవిత పేర్కొన్నారు.

