. . . ఎఐకెఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా మాజీ గౌరవ అధ్యక్షులు అమరుడు కామ్రేడ్ నాయక్ వాడి నరసయ్య పోరాట స్ఫూర్తితో రైతాంగ ఉద్యమాలను నిర్మిద్దామని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య అన్నారు. ఆదివారం ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో నిజామాబాద్ రూరల్ మండలం కాలుర్ గ్రామంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్లో నాయక్ వాడి నరయ్య ప్రథమ వర్ధంతి సభను కత్తుల సాయిలు అధ్యక్షతన నిర్వహించారు. ముందుగా నర్సన్న చిత్రపటానికి పూలమాల వేసి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళ్లు అర్పించారు. అనంతరం భూమయ్య మాట్లాడుతూ రైతాంగ సమస్యల పరిష్కారానికి జరిగిన అనేక ఉద్యమాలకు నరసయ్య నాయకత్వం వహించారని చెరుకు రైతుల పోరాటంలో ఎన్సిఎస్ఎఫ్ సారంగాపూర్ ఫ్యాక్టరీలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించ డంలో నర్సన్న పాత్ర ఎనలేనిదని వారన్నారు. సింగూరు నీరు ఇందురు హక్కుగా నిజాంసాగర్ ఆయకట్టు రక్షణకై జరిగిన పోరాటంలో, చక్కెర ఫ్యాక్టరీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో, మూతపడిన ఫ్యాక్టరీని తెరిపించడానికి, రామడుగు చెరువు రక్షణ తదితర పోరాటంలో నరసన్న పోరాటం వెలకట్టలేని వారన్నారు.

పాలకుల తప్పుడు విధానం వల్ల ఈనాడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాల మూలంగా వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేయబడుతుందని, మోడీ ప్రభుత్వం తీసుకు వస్తున్న చట్టాలు రైతుల మెడకు ఉరి తాళ్లుగా మారుతున్నాయని భూమయ్య అన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన విద్యుత్ చట్టం, విత్తన చట్టం, జీరాంజి చట్టాలు ప్రజలకు వ్యతిరేకమైనవని వాటిని వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సభలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ డివిజన్ నాయకులు శివకుమార్ మాట్లాడుతూ ఎగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన నర్సన్న ఒక రైతు సమస్యల కాకుండా పేద అణగారిన కార్మిక ప్రజల దైనందిన సమస్యలను పరిష్కరించడంలో ముందు వరసలో ఉన్నారని అన్నారు. కుల వివక్షతకు వ్యతిరేకంగా జరిపిన పోరాటాలు గ్రామాలలో పటేల్, పట్వారిలా దోపిడి దౌర్జన్యాల నిలదీస్తూ కళారూపాలను ప్రదర్శించి ప్రజలను పోరాటం వైపు నిలబెట్టిన గొప్ప నాయకుడని అన్నారు. మనమంతా ప్రజా ఉద్యమాలను నిర్మించడమే ఆయనకు అర్పించే ఘనమైన నివాళులని అన్నారు. ఈ కార్యక్రమంలో కత్తుల సాయిలు, సరికేల సాయిలు, కుత్తనాల గంగాధర్, సుశీల, కే.రజిత, నాడాపూర్ సాయవ్వ, కంతి పద్మ, సుజాత, కుర్ల సాయిలు తదితరులు పాల్గొన్నారు.

