. . . పార్టీ తరపున ప్రత్యేక కార్యాచరణ చేపడుతాం
. . . బూత్ లెవెల్ అసిస్టెంట్ల ద్వారా సహాయ సహకారాలు అందిస్తాం
. . . బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలి
. . . బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావ్
హైదరాబాద్, బతుకమ్మ :
జాతీయ ఎన్నికల సంఘాన్ని కలిసి తెలంగాణ ఎన్నారైల ఓటు హక్కును కాపాడేలా చూస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావ్ హామీ ఇచ్చారు. శుక్రవారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి నివాసంలో జరిగిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ ఛార్జీల సమావేశంలో సీనియర్ నేతలతో కూడిన సమీక్షా సమావేశంలో కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్ళిన తెలంగాణ బిడ్డల ఓటు హక్కును కాపాడేందుకు పార్టీ తరఫున ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నట్లు కేటీఆర్ తెలిపారు. త్వరలో రాష్ట్రంలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ఓటర్ల ఓట్ల జాబితా సవరణ కోసం ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ కార్యక్రమానికి సంబంధించిన విషయంలో లక్షలాది మంది తెలంగాణ ఎన్ఆర్ఐల నుంచి ఆందోళన వ్యక్తమవుతున్నదని అన్నారు. ఈ విషయంలో గల్ఫ్ బాట పట్టిన తెలంగాణ బిడ్డల ఓటు హక్కులు తొలగించకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని పార్టీ తరపున కలుస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఇప్పటికే వందలాది మంది ఎన్ఆర్ఐలు తమ స్థానిక శాసనసభ్యులకు, మాజీ శాసనసభ్యులకు ఫోన్లు చేసి ఆందోళన చెందుతున్న విషయాన్ని దృష్టికి తీసుకువచ్చారు. ఇందుకు సంబంధించి పార్టీ తరఫున ఒక సీనియర్ ప్రతినిధి, నాయకుల ప్రతినిధి బృందాన్ని, ఎమ్మెల్యేలు, ఎంపీల బృందాన్ని ఢిల్లీకి పంపనున్నట్లు తెలిపారు. దీంతో పాటు స్థానికంగా కూడా పార్టీ తరపున ఎస్ఐఆర్ కోసం నియమించిన బూత్ లెవెల్ అసిస్టెంట్ల ద్వారా గల్ఫ్ లోని తెలంగాణ బిడ్డల ఓటు హక్కును కాపాడేందుకు సహాయ సహకారాలు అందిస్తామని కేటీఆర్ తెలిపారు. తమకు కేటాయించిన బూత్ ల పరిధిలో గల్ఫ్ ఎన్ఆర్ఐల వివరాలు సేకరించి వారి ఓటు హక్కును ఎలక్షన్ కమిషన్ తొలగించకుండా సమన్వయం చేసుకోవాలని సూచించారు.

ఇందుకు సంబంధించి ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ ఇన్ చార్జ్ లు ప్రత్యేక చొరవ చూపాలని అన్నారు. దీంతో పాటు పార్టీ తరపున ఎస్ఐఆర్ కోసం నియమించిన బూత్ లెవెల్ ఏజెంట్లతో కూడా సమన్వయం చేసుకోవాలని సూచించారు. నేడు జరిగిన ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశంలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా చేపట్టాల్సిన కార్యాచరణను కేటీఆర్ నేతలకు వివరించారు. పార్టీ పెట్టిన తొలినాళ్లలోనే జిల్లా పరిషత్ ను గెలుచుకొని భారత రాష్ట్ర సమితికి ఆది నుంచి నిజామాబాద్ జిల్లా ఒక బలమైన కోటగా నిలిచిందని గుర్తుచేశారు. నిజామాబాద్ జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఒక అవకాశంగా తీసుకొని ముందుకు పోవాలని సూచించారు. కేసీఆర్ సూచించినట్లు సభ్యత్వ నమోదును కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని, దీంతోపాటు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని కూడా పకడ్బందీగా నిర్వహించి ఏ ఒక్క పౌరుడి ఓటు హక్కు తొలగించకుండా చూడాలని సూచించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని నేతలంతా తమ స్థానిక నియోజకవర్గాల్లో ఉన్న స్థితిగతులపైన కేటీఆర్కి వివరాలు అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వలన, చేస్తున్న మోసాల వలన అనేక వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని, తిరిగి కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారని నేతలు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని, రానున్న ఎన్నికల నాటికి తిరిగి జిల్లాలో భారత రాష్ట్ర సమితి పూర్తిగా స్వీప్ చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తామని నేతలు తెలిపారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎంపీ కే ఆర్ సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బిగాల గణేష్ గుప్తా, జాజల సురేందర్, హన్మంత్ షిండే, మాజీ ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు ముజీబుద్దీన్, ఆయేషా ఫాతిమా పాల్గొన్నారు.

