. . . పైసా లేనిదే పని కాదు
. . . ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు
రుద్రూర్, బతుకమ్మ :
రుద్రూర్ మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతుంది. పైసలు చేతిలో పడందే పనులు కావని, రోజు రోజుకి ప్రజలను పీడించే అధికారులు ఎక్కువవుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా తహసీల్దార్ కార్యాలయం మారిందని రైతులు ఆరోపిస్తున్నారు. దళారులు పైరవీకారులు లేనిదే కార్యాలయంలో పనులు జరగవని కచ్చితంగా దళారితో వెళితే మాత్రమే పనులు జరుగుతాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ధరణి వచ్చిన తర్వాత దళారులు ఎక్కువయ్యారు. ప్రతి పనికి ఓ రేటు ఫిక్స్ చేసి ప్రజలను నానా ఇబ్బందులు పెడుతున్నారు. ఏ పని కావాలన్నా పైరవీకారులు చెప్పాలి. అధికారులకు ముడుపులు అందజేస్తే ఏ పని అయినా సాధ్యం అనే సలహాలు పనులు జరుగుతున్నాయనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. పైసా లేనిదే పని కాదు. చిన్న స్థాయి ఉద్యోగి నుంచి అధికారికి ముడుపులు చెల్లించాల్సిందేనని రెవెన్యూ కార్యాలయంలో ఎవరికీ ఒక్క పైసా కూడా లంచం ఇవ్వొద్దని ఉన్నతాధికారులు చెబుతున్నా మండల తహశీల్దార్ కార్యాలయంలో అధికారుల పని తీరు మాత్రం మారటం లేదు. ఫలానా ధ్రువ పత్రాలను పలానా గడువులోగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్దేశించిది. కానీ అధికారులు మాత్రం డబ్బు కోసం ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేస్తున్నారని, ఆన్లైన్ లో అర్జీ చేసుకున్న తర్వాత ధ్రువ పత్రాల కోసం నెలల తరబడి తహశీల్దార్ కార్యాలయం చుట్టు ప్రదక్షిణలు చేయడమే జరుగుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వలన కొంతమంది వ్యవసాయ భూములను ప్రభుత్వ భూమి లాగా నమోదు చేశారు. రైతులు తహశీల్దార్ కి భూములను ఆన్లైన్లో మార్పిడి చేయాలని అర్జీ పెట్టుకున్న మూడు నాలుగు నెలలు అయినా చేయడం లేదని, డబ్బులు ఇస్తేనే రైతుల పేరు మీద మార్పిడి చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. లంచం ఇచ్చిన అర్జీదారుని సమస్యను పరిష్కరిస్తున్నారని పలు విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
