. . . అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నిజామాబాద్ అర్బన్ను అభివృద్ధిలో ముందంజలో నిలిపే దిశగా నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ భరోసా ఇచ్చారు. నగరంలోని సోనీ ఫంక్షన్ హాల్ సమీపంలో సుమారు రూ.4 కోట్ల 83 లక్షల వ్యయంతో చేపట్టనున్న బ్రిడ్జి నిర్మాణ పనులకు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ శనివారం భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 9–10 సంవత్సరాలుగా నిలిచిపోయిన ఈ బ్రిడ్జి నిర్మాణ పనులను అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, నిధులు మంజూరు చేయించగలిగామని, ఈ నిధులతో బ్రిడ్జి పనులకు మోక్షం లభించిందని పేర్కొన్నారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే అమ్మ వెంచర్, రింగ్ రోడ్ ప్రాంతాలకు రాకపోకలు మరింత సులభమవుతాయని, అలాగే భవిష్యత్తులో అండర్గ్రౌండ్ డ్రైనేజీ అభివృద్ధికి కూడా అనుకూలంగా ఉంటుందనన్నారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ప్రస్తుతం ప్రతి డివిజన్కు కోటి రూపాయల చొప్పున చేపడుతున్న అభివృద్ధి పనులు కేవలం ఆరంభమేనని, రానున్న రోజుల్లో మరింత పెద్ద స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. అభివృద్ధి పనుల్లో ఎక్కడా ఆలస్యం లేకుండా ఫాస్ట్ ట్రాక్లో పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. అలాగే ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు బిల్లులు వెంటనే మంజూరు చేసి పనులు నిరాటంకంగా సాగేలా సహకరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ న్యాలం రాజు, బీజేపీ నాయకులు, ఎల్లమ్మ గుట్ట మున్నూరు కాపు సంఘం కమిటీ సభ్యులు, అమ్మ వెంచర్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
