. . . సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు ఏ.రమేష్ బాబు
. . . కార్మిక శాఖ కార్యాలయం ముందు సీఐటీయు, టీయుసీఐ, ఏఐటీయుసి సంఘాల ధర్నా
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
సీఐజీ కార్మికులకు వెంటనే వేతనాలు విడుదల చేయాలని, వారి న్యాయమైన డిమాండ్లు పరిష్కారం అయ్యేవరకు ఆందోళనలు కొనసాగిస్తామని సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు ఏ.రమేష్ బాబు అన్నారు. సిఐజి గ్రూపులను యధావిధిగా కొనసాగించాలని, కాంట్రాక్ట్ ఏజెన్సీ కార్మికులతో కొత్త గ్రూపులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు, టీయుసీఐ, ఎఐటియుసి సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం కార్మిక శాఖ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులపై అధికారులు కక్షాపూరిత వైఖరిని ప్రదర్శించడం సరికాదన్నారు. వెంటనే కార్మిక శాఖ అధికారులు జోక్యం చేసుకుని కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాంటాక్ట్ ఏజెన్సీ కార్మికులకు వేతనాలు ఇచ్చి, సిఐజి గ్రూపుల కార్మికులకు ఇవ్వకపోవడం అధికారుల కక్షాపూరిత వైఖరికి నిదర్శనమన్నారు. ఇప్పటికే ఉన్న సిఐజి గ్రూపులను కొనసాగిస్తూ, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ కార్మికుల గ్రూపులుగా చేయాలన్నారు. అదే విధంగా ఔట్ సోర్సింగ్ కార్మికులందరికీ యూనిఫామ్, సబ్బులు, నూనెలు, రక్షణ పరికరాలు ఇవ్వాలన్నారు. మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం నెలకు 26వేలు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో టీయుసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్, ఏఐటీయుసీ జిల్లా కార్యదర్శి ఓమయ్య, నాయకులు కిరణ్, రవి, శాంతికుమార్, విజయ్, సావిత్రి చంద్రశేఖర్, బాలాజీ, హరీష్, మహేష్, గంగాధర్, లక్ష్మి, శైలజ, నవీన్, సాయిలు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

