. . . జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
మాతా శిశు సంరక్షణే ధ్యేయంగా వైద్యులు, సిబ్బంది అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ప్రసవాల సందర్భంగా మాతాశిశు మరణాలు చోటుచేసుకోకుండా ముందస్తుగానే క్రమం తప్పకుండా వైద్య సేవలు అందిస్తూ, నిశిత పర్యవేక్షణ జరపాలని అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి మాతా శిశు మరణాల నిరోధక కమిటీ సమావేశం జరిగింది. ఇటీవలి కాలంలో జిల్లాలో చోటుచేసుకున్న మాతాశిశు మరణాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏ ఆసుపత్రిలో సంఘటన చోటుచేసుకుంది, మరణం సంభవించడానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటీ, వైద్య సేవలలో ఏమైనా లోపం జరిగిందా అని ఆరా తీస్తూ, రికార్డులను పరిశీలించారు. మాతాశిశు మరణాలు జరగకుండా ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

ఎక్కడ సంఘటన జరిగినా లోతుగా పరిశీలన జరుపుతామని, నిర్లక్ష్యం కారణంగా మరణం సంభవించినట్టు వెల్లడి అయితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. గర్భిణీలకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు జరుపుతూ, అవసరమైన వైద్య చికిత్సలు అందించాలని సూచించారు. వారు పుట్టింటికి వెళ్ళిన పక్షంలో వారి హెల్త్ రికార్డును అక్కడి అధికారులకు పంపాలని, క్షేత్రస్థాయిలో ఆశాలు, అంగన్వాడీలు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. హైరిస్క్ ప్రెగ్నెన్సీ కేసుల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని, వారి ఇళ్ళను సందర్శించి ఆరోగ్య స్థితిని వాకబు చేయాలని అన్నారు. అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు, నర్సింగ్ హోంలలో తప్పనిసరిగా తగిన పరిజ్ఞానం కలిగిన నిపుణులైన వైద్యులు, ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉండాలని, వైద్య పరీక్షలు, చికిత్సలు అందించే విషయంలో ఎలాంటి లోపం జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా రక్త హీనత, బీ.పీ పరీక్షలు క్రమం తప్పకుండా చేయాలని, అవసరమైన వారికి మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తూ, ఎంతో విలువైన నిండు ప్రాణాలు కాపాడాలని సూచించారు. కాన్పు సందర్భంగా అనుకోని పరిస్థితుల్లో తల్లి మరణిస్తే, బాధిత కుటుంబం చిన్నాభిన్నం అయ్యే అవకాశం ఉంటుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని అన్నారు. ఈ సమావేశంలో డీఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ, టి.వినయ్ డీ.సీ.హెచ్.ఎస్ శ్రీనివాస్ ప్రసాద్, కమిటీ సభ్యుడు బుస్స ఆంజనేయులు, స్వంచ్చంధ సంస్థల ప్రతినిధులు, సంబంధిత వైద్యాధికారులు, వైద్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

