. . . రాష్ట్ర అధ్యక్షులు కౌలే జగన్నాథం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
విశ్వకర్మ సమాజ అభ్యున్నతి కోసం ప్రతి ఒక్కరూ ఐక్యతతో ముందుకు సాగాలని రాష్ట్ర అధ్యక్షులు కౌలే జగన్నాథం అన్నారు. నిజామాబాద్ కేంద్రంలోని గోశాల భవన్ హాల్లో ఆదివారం ది అఖిల భారత విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ సంఘం బలోపేతమే సమాజ అభివృద్ధికి పునాది అని, అన్ని వర్గాల విశ్వకర్మలను ఒకే వేదిక పైకి తీసుకువచ్చి వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా అధ్యక్షులు గంగా మోహన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో జిల్లాలోని 11 మండలాల అధ్యక్షులు, నాయకులు పాల్గొని విశ్వబ్రాహ్మణుల సామాజిక, ఆర్థిక, విద్యా సంబంధిత సమస్యలపై విస్తృతంగా చర్చించారు.

ప్రభుత్వ పథకాల అమలులో విశ్వకర్మలకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పించాలని, సమాజ అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్ను వెంటనే ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అలాగే 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న విశ్వకర్మలకు నెలకు రూ.10 వేల పెన్షన్ మంజూరు చేయాలని, పేద, నిరుపేద విశ్వకర్మ కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. సంప్రదాయ వృత్తులను కొనసాగిస్తున్న విశ్వకర్మ కళాకారులకు ఆర్థిక సహాయం, రుణ సదుపాయాలు, ఉపాధి అవకాశాలు కల్పించాలని తీర్మానించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంకోజు లింగాచారి మాట్లాడుతూ విశ్వకర్మ సమాజం రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో మరింత బలపడాలంటే సంఘటిత శక్తిగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. హక్కుల సాధన కోసం ప్రతి మండలంలో సంఘ కార్యకలాపాలను విస్తరించి యువతను కూడా సంఘంలో భాగస్వాములను చేయాలని సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కోశాధికారి ఆవంచ మురళీధర్ చారి, అధికార ప్రతినిధి పడాల సతీష్ చారి, 33 జిల్లాల కన్వీనర్ డాక్టర్ పోకూరి లక్ష్మీనాచారి, మహిళ ఉపాధ్యక్షురాలు ఇంద్రాల అశ్విని, మహిళ అధికార ప్రతినిధి కస్తోజు శ్రావణి, జిల్లా అధ్యక్షులు గంగా మోహన్, ప్రధాన కార్యదర్శి డి.ఎల్.ఎన్. చారి, కోశాధికారి నరేష్తో పాటు రాజు, వినోద్, రాము, నవీన్ చారి, శ్రీనివాస్, నారాయణ, రాణావీర్, మండల కమిటీ, గ్రామ కమిటీ సభ్యులు, పెద్ద సంఖ్యలో విశ్వకర్మ సంఘ నాయకులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం సంఘ బలోపేతం, సభ్యత్వ నమోదు, ప్రభుత్వానికి వినతిపత్రాల సమర్పణ తదితర అంశాలపై కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు.

