సగం భాగం బీసీలు సమాజంలో ఉన్నారు
ధర్నా చౌక్ వద్ద 72 గంటల నిరాహార దీక్ష ప్రారంభించిన కవిత
హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణలో ప్రతి ఒక్కరికి రాజ్యాధికారంలో వాటా కావాలని, ఆర్థిక అవకాశాలు రావాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. 42శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం హైదరాబాద్ లోని ధర్నా చౌక్ వద్ద 72 గంటల నిరాహార దీక్షను సోమవారం కవిత చేపట్టారు. బీఆర్ అంబేడ్కర్, ఫులే, జయశంకర్ విగ్రహాలకు ఆమె నివాళి అర్పించారు. ఈసందర్భంగా కవిత మాట్లాడుతూ సమాజంలో సగభాగంలో బీసీలు ఉన్నారని, వాళ్లకు రాజకీయంగా సమ ప్రాధాన్యం దక్కాలనే ఈదీక్ష చేపట్టినట్లు పేర్కొన్నారు. తెలంగాణ జాగృతి ఈరోజు చేసే పోరాటం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పినట్లు బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ మీద నెపం పెట్టి తప్పించుకోవాలని చూస్తోందన్నారు. బీసీ బిల్లుపై బీజేపీ లెవనెత్తిన అనుమానాలను సీఎం నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు. మస్లింలకు అదనంగా 10 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇవ్వాలని, ముస్లింలను మినహాయించి బీసీలకే 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. ఈదీక్షకు తెలంగాణ జాగృతి శ్రేణులు తరలివచ్చి కవితకు మద్దతు తెలిపాయి. నిరాహార దీక్ష ప్రారంభించడానికి ముందు కవిత తన నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తన అత్తమామలు దేవనపల్లి రాంకిషన్ రావు – నవలత, భర్త అనిల్ ఆశీర్వాదం తీసుకున్నారు.

