- ఫార్మా కంపెనీల ఇష్టారాజ్యం
- అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపణ
- రోగాల బారిన పడుతున్నామని ఆవేదన
బతుకమ్మ, భిక్కనూరు: పచ్చని పల్లెలు కాలుష్యకొరలో చిక్కుకుంటున్నాయి సాయంత్రం వేళలో పరిశ్రమలు యదేచ్చగా విషవాయులను విడుదల చేయడంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అయినా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే….. భిక్కనూరు మండలంలోని జంగంపల్లి జాతీయ రహదారికి 200 మీటర్ల దూరంలో ఉన్న ఐదు, ఆరు ఫార్మా కంపెనీలు, భిక్కనూరు శివారులో ఒక పెద్ద ఫార్మ కంపెనీ ఉన్నాయి అయితే నిబంధనలకు విరుద్ధంగా పరిశ్రమలు పట్టపగలు సాయంత్రం యదేచ్చగా విషవాయువులను విడుదల చేస్తున్నాయి. యాజమాన్యాలు వ్యాపారమే ధ్యేయంగా పనిచేసే కార్మికులకు సైతం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. జాతీయ రహదారి గుండా మహాత్మ జ్యోతిబాపూలే స్కూల్, జంగంపల్లి ప్రజలు పరిశ్రమల వదిలే విషవాయువులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు మాత్రం సాయంత్రం ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పరిశ్రమల తీరును నిరసిస్తూ గతంలో పరిశ్రమల వద్ద ధర్నా రాస్తారోకోలు చేసిన సందర్భాలు సైతం ఉన్నాయి.సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసిన ఎలాంటి స్పందన లేదని ప్రజలు విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.ఒకవేళ పరిశ్రమల యాజమాన్యాలను నిలదీస్తే దిక్కునచోట చెప్పుకోమని దురుసుగా మాట్లాడుతున్నారని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కాలుష్యకోరల నుంచి గ్రామాలను మరియు విద్యార్థులను కాపాడాలని విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామ ప్రజలువిజ్ఞప్తి చేస్తున్నారు.

