. . . జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఈ నెల 4, 6, 8, 10వ తేదీలలో జిల్లా వ్యాప్తంగా గ్రామ, వార్డు సభలను విజయవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గ్రామ, వార్డు సభల నిర్వహణపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తో కలిసి నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి కలెక్టర్ ఇలా త్రిపాఠి, సంబంధిత శాఖల జిల్లా అధికారులు వీ.సీలో పాల్గొన్నారు. సభలను విజయవంతం చేసేందుకు అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియకు సహకరించేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ప్రస్తుతం నిర్వహిస్తున్న పర్యావరణ వారోత్సవాలను షెడ్యూల్ ప్రకారం విజయవంతం చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా వీసీ అనంతరం కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత శాఖల అధికారులతో సమావేశమై కీలక సూచనలు చేశారు. గ్రామ, వార్డు సభలలో ప్రజా ప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులతో పాటు అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనేలా కృషి చేయాలని అన్నారు. సభల నిర్వహణకు నిర్ణీత షెడ్యూల్ తయారు చేసి, తదనుగుణంగా ముందుకెళ్లాలన్నారు. మండల ప్రత్యేక అధికారులు, తహసిల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీఓలు, ఎంఏఓలను నోడల్ అధికారులుగా నియమించి నిర్దేశిత తేదీలలో ఆయా గ్రామ పంచాయతీలలో గ్రామ సభలను నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

అదేవిధంగా నిజామాబాద్ నగర పాలక సంస్థతో పాటు బోధన్ ఆర్మూర్ భీమ్గల్ మున్సిపల్ పట్టణాలలో వార్డుల వారీగా సభలను ఏర్పాటు చేసి, ప్రభుత్వం నిర్దేశించిన అంశాలపై చర్చించాలని అన్నారు. ఈ సభల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, వర్షపు నీరు నిలువ చేయడం తదితర అంశాలపై అవగాహన కలిగించాలన్నారు. గ్రామ సభల్లోనూ రైతులకు ఆయిల్ ఫామ్, హార్టికల్చర్, ఫార్మర్ రిజిస్ట్రీ, నానో యూరియా, తదితర అంశాలపై పిపిటి ద్వారా తెలియజేయాలన్నారు. ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలోనూ కరెంటు షాక్ ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర అంశాల గురించి ఈ సభల్లో అవగాహన కల్పించాలన్నారు. సంబంధిత శాఖల అధికారులందరూ చిత్తశుద్ధితో పనిచేసి సభలను విజయవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, భుజంగరావు, డీఆర్ఓ బి.గీత, డీఆర్డీఓ సాయన్న, జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, బోధన్ ఆర్డీఓ విజయలక్ష్మి, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డీఏఓ వీరస్వామి, సీపీఓ రతన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
