నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
క్రైస్తవ మతంలోకి మారిన అనుసూచిత జాతుల (ఎస్సీ) వారికి ఎస్సీ హోదా రద్దు చేసే విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) స్వాగతించింది. ఈ మేరకు వీహెచ్పీ ఇందూరు విభాగ్ కార్యదర్శి తమ్మల కృష్ణ ఒక ప్రకటన విడుదల చేశారు. గతంలో ఆంధ్రప్రదేశ్ హై కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ సుప్రీం కోర్టు ధర్మాసనం ఇచ్చిన తాజా తీర్పు హర్షణీయమని ఆయన పేర్కొన్నారు. క్రైస్తవ మతంలోకి మారిన ఎస్సీలు తమ ఎస్సీ హక్కులను కోల్పోవలసి వస్తుందని తెలిపారు. తహసీల్దార్ ఇచ్చిన కుల ధ్రువీకరణ పత్రం ఉన్నప్పటికీ, మత మార్పిడి తర్వాత ఎస్సీ హోదా కొనసాగదని ఆయన స్పష్టం చేశారు. అలాగే క్రైస్తవ మతంలోకి మారిన ఎస్సీలు నమోదు చేసే అట్రాసిటీ కేసులు చెల్లవని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఎస్సీ రిజర్వేషన్ల ప్రయోజనాలు పొందుతున్న క్రైస్తవులు తమ పదవులు, ఉద్యోగాలకు వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సంబంధిత ఉన్నతాధికారులు సుప్రీం కోర్టు తీర్పును కచ్చితంగా అమలు చేసి, ఎస్సీ రిజర్వేషన్లను అనుభవిస్తున్న వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. లేదంటే వీహెచ్పీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తమ్మల కృష్ణ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు దినేష్ ఠాకూర్ జీ, జిల్లా కార్యదర్శి గాజుల దయానంద్, తెలంగాణ ప్రాంత కృషి ప్రముక్ దాత్రిక రమేష్, కోశాధికారి నాంపల్లి శేఖర్జీ , జిల్లా ఉపాధ్యక్షులు రెబ్బ ఆనంద్ జీ, జిల్లా సేవా ప్రముఖ్ రాంప్రసాద్ చటర్జీ, నగర కార్యదర్శి బాసొల్లా నీకేష్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.
