మద్నూర్, బతుకమ్మ:
మద్నూర్ మండల కేంద్రంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంకు సంబంధించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, కామారెడ్డి డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ తో పాటు ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం పేరును ‘వికసిత్ భారత్-గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక మిషన్’ గా మార్చడాన్ని తీవ్రంగా ఖండించారు. వీబీ జీ రామ్ జీను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పథకం పేరు నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడం ద్వారా గాంధీజీ ఆలోచనలు, విలువల పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న వ్యతిరేక వైఖరి స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించి, ప్రజలకు ఉపాధి హక్కును, గ్రామ పంచాయతీలకు పాలనా హక్కులను తిరిగి కల్పించాలని డిమాండ్ చేశారు. గతంలో ఉపాధి హామీ చట్టం ద్వారా ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 100 రోజుల పని హక్కు ఉండేదని, ప్రస్తుతం వీబీ జీ రామ్ జీ చట్టం వల్ల కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసి బడ్జెట్ కేటాయించినప్పుడే పని లభించే పరిస్థితి ఏర్పడిందని ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు తెలిపారు. ఉపాధి హామీ పథకం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఆధార స్తంభం వంటిదని, దీనిని బలహీనపరచడం దేశాభివృద్ధికి ఏ మాత్రం మంచిది కాదని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల నాయకులు, అధికారులు, ప్రజలు, ఉపాధి హామీ కూలీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



