బతుకమ్మ : నాగిరెడ్డిపేట : ఉగాది, రంజాన్ పండుగలను హిందువులు, ముస్లింలు మతసామరస్యాల కనుగుణంగా, శాంతియుతంగా జరుపుకోవాలని ఎల్లారెడ్డి సిఐ రవీందర్ నాయక్ సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో హిందూ, ముస్లిం సోదరులతో స్థానిక ఎస్సై మల్లారెడ్డి అధ్యక్షతన శాంతి సమావేశం నిర్వహించారు. సిఐ రవీందర్ నాయక్ మాట్లాడుతూ ఉగాది పండుగ సందర్భంగా మండల కేంద్రంలోని నల్ల పోచమ్మ ఆలయం వద్ద జరిగే ఎడ్లబండ్ల ఊరేగింపు, బోనాల పండుగ, రథోత్సవం సందర్భంగా ఎలాంటి అల్లర్లు, ఘర్షణలకు తావివ్వకుండా మతసామరస్యంగా, శాంతియుతంగా పండుగలను జరుపుకోవాలని సూచించారు. అలాగే ముస్లిం సోదరులు రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు జరుపుకొని పండగను శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. నల్ల పోచమ్మ జాతర ఉత్సవాలలో ఎడ్లబండ్లను సీరియల్ ప్రకారం ఆలయం చుట్టూ తిప్పాలని, ఎవరైనా వ్యక్తులు అల్లర్లు, ఘర్షణలకు పాల్పడితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీనివాసరావు, నల్ల పోచమ్మ ఆలయ కమిటీ చైర్మన్ కొంసాని హన్మంత్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, ముస్లిం సోదరులు, ఎస్సై మల్లారెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
