. . . 17 ఏళ్లుగా అవినీతి సొమ్మును పోగు చేసుకుని పన్ను కట్టని అవినీతి పరుడు కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి
. . . కార్పొరేషన్ ఎన్నికల్లో పిసిసి అధ్యక్షుడు ఎన్ని కోట్లకు అమ్ముడుపోయాడో ప్రజలకు సమాధానం చెప్పాలి
. . . నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ఇందూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ట్రిపుల్ ఇంజన్ సర్కార్ రాబోతుందని, 19 డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి 17 ఏళ్లుగా మున్సిపల్ కార్పొరేషన్ లో ఆస్తి పన్ను కట్టకుండా ఎగ్గొట్టి ఇప్పుడు కార్పొరేటర్ సీటు వచ్చిందని అక్షరాల 8 కోట్ల 16 లక్షల పైచిలుకు పన్ను కట్టిన అతను గెలిస్తే డివిజన్ కు, డివిజన్ ప్రజలకు ఏం న్యాయం చేస్తారని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ప్రశ్నించారు. అసలు ఆయనకు ఏం అనుభవం ఉందని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ టికెట్ ఇచ్చారని, ఎన్ని కోట్లకు మహేష్ కుమార్ అమ్ముడు పోయారని ఆరోపించారు. డివిజన్ లో ప్రజలకు డబ్బు ఆశ చూపి ఓట్లు వేయించుకునే కుట్ర పన్నుతున్నారని, అవినీతిపరుడైన ఆయన, రాజకీయ పరిజ్ఞానం లేని ఆయన సతీమణికి ఏ విధంగా టిక్కెట్ ఇచ్చారో ప్రజలకు కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఆయన ఒక వ్యాపారవేత్త అని ప్రజలు అతనిని గెలిపిస్తే రాజకీయాలను వ్యాపారంగా మార్చి ఇందూరును పూర్తిగా కబ్జా చేసి ఎక్కడపడితే అక్కడ తమ వ్యాపార సామ్రాజ్యాలు విస్తరింపచేస్తారని ఆయన దుయ్యబట్టారు. అదే డివిజన్ లో బిజెపి పార్టీ నుండి తమ అభ్యర్థి అయిన నా సోదరుడు లాంటి నాగోళ్ళ లక్ష్మీనారాయణ ఎటువంటి మచ్చలేని నాయకుడని, అందుకే సర్వేలన్నీ అతను దాదాపు 45 శాతం మెజారిటీతో గెలుస్తాడని ప్రకటిస్తున్నాయని అన్నారు. తను ఎమ్మెల్యేగా గెలిచి దాదాపు రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఎక్కడ కూడా అవినీతికి తావివ్వకుండా పేదలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందించడం కోసం నిరంతరం కృషి చేస్తున్నానని అన్నారు. బిజెపి అంటేనే అభివృద్ధి అని, అభివృద్ధి అంటేనే బిజెపి అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో మెజార్టీ స్థాయిలో బిజెపి పార్టీ గెలుస్తుందని ఇందూర్ మున్సిపల్ కార్పొరేషన్ పై బిజెపి జెండా ఎగరవేయడం ఖాయమని ఆయన అన్నారు. అవినీతిరహిత కార్పొరేషన్ ను తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నీతి నిజాయితీకి మారుపేరైన నాగోళ్ళ లక్ష్మీనారాయణ ను 19వ డివిజన్ ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అలాగే 42వ డివిజన్ బిజెపి అభ్యర్థి బెల్లాల్ శశాంక్, 43 వ డివిజన్ బిజెపి అభ్యర్థి సోమలింగంని తమ సంబంధిత డివిజన్ వాసులు గెలిపించి ఆశీర్వదించాలని కోరారు.

