- ఆ గ్రామ వీడీసీకి రూ.18 లక్షలతో ఒప్పందం
- ఆ లీడర్ కార్యాలయం వెనుకనే ఇసుక డంప్
- రాత్రి తవ్వకాలు . . . పగలు రవాణా
- రెవెన్యూ, పోలీసు శాఖలు గప్ చూప్
నిజామాబాద్, బతుకమ్మ : ప్రతి పక్షంలో ఉన్నపుడు ఆయన ధర్మరాజు ( కాంగ్రెస్ నేత). ఇసుక అక్రమ రవాణా దందాపై ప్రశ్నించి ప్రజల్లో గుర్తింపు కోసం గొంతు లేచేది. ఇప్పుడు అధికారం లో ఉన్నామని తన ప్రైవేట్ కార్యాలయం కాస్త “అవినీతి నిలయం” గా మారిందా? అంటే ఔననే చెబుతున్నారు. ఆయన అనుచరులు కాంగ్రెస్ నేత కార్యాలయం ప్రక్కనే కూత వేటు దూరంలోనే ఇసుక అక్రమ రవాణా చేస్తే కనబడటం లేదా? ఇసుక డంపులు పెద్ద పెద్ద గుట్టల మాదిరిగా ఉన్న కనబడతలేవా? ఎటుకూడా అధికారం ఉందని పోలీసు, రెవెన్యూ అధికారులను నోరు మూయించి నీ అనుచరులు ఇసుక అక్రమ రవాణా రాత్రి పగలు తేడా లేకుండా ఇష్టమున్నట్లు దోచుకుంటే మీరెందుకు మౌనంగా ఉంటున్నారు. ప్రశ్నించే గొంతు ఎందుకు ముగబోయింది? మీ వాటలు మీకు ముడుతున్నాయా ఏంది? ఇంతటి అక్రమాలకు పాల్పడితే ప్రజలు ఏమనుకోవాలి.మీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు అన్న విధానమేనా అనే చర్చ బాల్కొండ నియోజకవర్గంలో జరుగుతుంది.

నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలంలోని గాండ్లపేట్ శివారులో పెద్ద వాగు నుంచి ఇసుక అక్రమంగా తవ్వకాలు, రవాణా జరుగుతుంది. స్థానికంగా ఉన్న గ్రామాభివ`ద్ది కమిటీకి రూ.18 లక్షల ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతుంది. రాత్రివేళల్లో ఇసుకను తవ్వకాలు చేసి స్థానికంగా మోర్తాడ్ ప్రాంతంలో నాలుగు ఏరియాలో ఇసుకను భారీగా డంప్ చేస్తున్నారు. మధ్యాహ్నం టిప్పర్లు , టరాజ్ లలో ఇసుకను తరలిస్తున్నారు. రెవెన్యూ, పోలీసు శాఖలు గంతలు కట్టుకోగా మైనింగ్ డిపార్ట్ మెంట్ ఇటు వైపు కన్నెత్తి చూడడం లేదు. నిజామాబాద్ జిల్లాలో టీఎస్ఎంఐడీసీ కేవలం మంజిరా ప్రాంతంలో ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇచ్చిన విషయం తెల్సిందే. కానీ బాల్కొండ నియోజకవర్గంలో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా జరుగుతున్నాయి.

నిజామాబాద్ జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీ గెలువకపోయినా బాల్కొండ నియోజకవర్గంలో ముగ్గురు నేతలకు కార్పొరేషన్ పదవులు దక్కాయి. అందున మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా వ్యవహరిస్తున్న ఈరవత్రి అనిల్ ప్రాతినిధ్యం వహిస్తున్న బాల్కొండలో ఇసుక అక్రమంగా తవ్వకాలు, రవాణా కలకలం రేపుతున్నాయి. మొన్నటి వరకు ఇసుక రవాణాకు సహకరించిన పోలసు అధికారులను బాల్కొండ నియోజకవర్గంలో పోస్టింగ్ వేయించుకున్నారన్న వాదనలు లేకపోలేదు.వారు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో ఇసుక రాత్రుళ్లు తవ్వకాలు, డంపింగ్ కార్యక్రమం జరుగుతుంది. ఎలాంటి వే బిల్లులు, అనుమతులు లేకపోయినా జాతీయ రహదారుల పై నుంచి వాహనాలు దూసుకపోతున్నాయ. ఇసుక తరలింపులో లక్షల రూపాయల మామూళ్ళు ముడుతుండడంతో పెద్దవాగు ప్రాంతంలో జరుగుతున్న ఇసుక రవాణాకు అడ్డుకట్టపడటం లేదన్న విమర్శలున్నాయి. ఇటీవల పొద్దున పూట ఒక ఇసుక టప్పర్ ను పోలీసులు పట్టుకోగా సాయంత్రానికి పొలీసుల వాహనాల ముందే ఇసుక రవాణా జరుగడం విశేషం.

