నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : టీఎన్జీఓ జిల్లా కార్యవర్గ సమావేశం ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్, టిఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతి కుంట శేఖర్ అధ్యక్షతన గురువారం టిఎన్జీవో జిల్లా కార్యాలయం లోనిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సుమన్ కుమార్ ఇటీవల సీఎం ఉద్యోగుల సమస్యలపై మాట్లాడిన తీరును వివరించారు. దీనికి గాను రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల వివరణల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు ఐఏఎస్ లతో కూడిన త్రిసభ్య కమిటీని తక్షణమే ఏర్పాటు చేసి 7 రోజుల్లో ఉద్యోగుల సమస్యలపై నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని ఉత్తర్వుల ద్వారా కోరిందన్నారు. దానిని ఉద్యోగుల ఉద్యమ మొదటి విజయంగా భావించాలని తెలిపారు. ఇదివరకే రాష్ట్ర జేఏసీ విడుదల చేసిన ఉద్యమ కార్యచరణ ఉన్నప్పటికీ సింధూర్ ఆపరేషన్ లో భాగంగా దాయాది దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని మానవతా దృక్పథంతో కొన్ని మార్పులు చేర్పులతో, ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై ఉద్యమ కార్యచరణను వాయిదా వేసినట్టు తెలిపారు. నేడో రేపో త్రిసభ్య కమిటీతో జరగబోయే చర్చలో సానుకూలత వస్తుందని భావిస్తున్నామని, లేనియెడల రాష్ట్ర కమిటీ ఆదేశాలనుసారం ఉద్యమ కార్యచరణను యధాతధంగా చేపడతామని, దానికి ఉద్యోగులందరూ సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో టీఎన్జీవో రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎం.సతీష్, జిల్లా సహాధ్యక్షులు పెద్దోళ్ల నాగరాజు, కోశాధికారి దినేష్ బాబు, టీఎన్జీవో ముఖ్య సలహాదారులు వనమాల సుధాకర్, అన్ని శాఖల అధ్యక్ష కార్యదర్శులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, మహిళా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
