. . . గ్రామ సర్పంచ్ కొలిప్యాక ఉపేందర్ రెడ్డి
ఏర్గట్ల, బతుకమ్మ :
ప్రస్తుతం సీజనల్గా పశువులు, గొర్రెలు, మేకలు, ఇతర పెంపుడు జంతువుల్లో వ్యాధులు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో వాటి నివారణకు అవసరమైన వ్యాక్సినేషన్ను సకాలంలో నిర్వహించాలని గ్రామ సర్పంచ్ కొలిప్యాక ఉపేందర్ రెడ్డి పశువైద్యశాల అధికారులను ఆదేశించారు. ఏర్గట్ల గ్రామంలోని పశువైద్యశాలను ఆయన మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా పశువైద్యశాల పనితీరు, పశువులకు అందుతున్న వైద్య సేవలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ స్థాయిలో ప్రత్యేక వ్యాక్సినేషన్ శిబిరాలను నిర్వహించాలని సూచించారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రతి పశుపాలకుడికి వ్యాక్సినేషన్ సేవలు చేరేలా కార్యాచరణ చేపట్టాలని తెలిపారు. పశువుల ఆరోగ్యం రైతుల ఆర్థికాభివృద్ధికి ఎంతో కీలకమని పేర్కొన్న సర్పంచ్, ఏర్గట్ల గ్రామంలోని ప్రతి పశుపాలకుడు ప్రభుత్వం నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లైవ్స్టాక్ అధికారి నరేందర్, గ్రామ యాదవ సంఘ సభ్యులు, పశువైద్యశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
