. . . కమిషనర్కు బీజేపీ కౌన్సిలర్ల వినతి పత్రం
కామారెడ్డి, బతుకమ్మ :
రాబోయే మున్సిపల్ సాధారణ సమావేశ ఎజెండాలో పట్టణ సమస్యలకు సంబంధించిన మూడు కీలక అంశాలను పొందుపరచాలని కోరుతూ మంగళవారం బీజేపీ కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు. కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఆదేశాల మేరకు ఈ వినతి పత్రం సమర్పించినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ కౌన్సిలర్లు మాట్లాడుతూ.. కొన్ని రోజుల క్రితం కామారెడ్డి పాత బస్టాండ్ వద్ద జరిగిన అగ్నిప్రమాదంలో పూలు, పండ్ల దుకాణాలు కాలిపోయి వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారని, వారి పునర్నిర్మాణానికి మున్సిపల్ నిధులు కేటాయించాలని కోరారు. అలాగే పట్టణంలోని శ్మశాన వాటికల అభివృద్ధి పనులను ఫౌండేషన్ కు అప్పగించేలా తీర్మానం చేయాలన్నారు. దీనివల్ల గతంలో స్మశానాల కోసం కేటాయించిన రూ. 1 కోటి 30 లక్షల నిధులు మిగులుతాయని, ఆ నిధులను పట్టణంలోని అన్ని వార్డుల అభివృద్ధికి సమానంగా కేటాయించాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు గత సమావేశంలో తాగునీటి సమస్య (బోర్లు మోటార్ల) కోసం వార్డుకు రూ. 3 లక్షల చొప్పున కేటాయించిన నిధులను ప్రస్తుత అవసరాల దృష్ట్యా డ్రైనేజీల నిర్మాణానికి అన్ని వార్డులకు సమానంగా మళ్లించే అంశాన్ని కూడా ఎజెండాలో చేర్చాలని కోరారు. ఈ మూడు ప్రధాన ప్రజా సమస్యలపై రాబోయే సమావేశంలో చర్చించి తీర్మానం ఆమోదించాలని కౌన్సిలర్లు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి మున్సిపల్ బీజేపీ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

