నిజామాబాద్, బతుకమ్మ : నిజాం నవాబు నిరంకుశ పాలనకు ఎదురుతిరిగిన తెలంగాణ పోరాట వీరుల పటిమను భావి తరాలకు తెలియజేయాలని ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్బంగా బుధవారం భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో అధ్యక్షులు దినేష్ కులాచారితో కలిసి ధన్ పాల్ సూర్యనారాయణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ధన్ పాల్ మాట్లాడుతూ 1947 ఆగస్టు 15న భారతదేశనికి స్వాతంత్రం లభిస్తే తెలంగాణకు 1948 సెప్టెంబర్ 17న లభించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ సాయుధ పోరాట యోధుల త్యాగాలను గుర్తించి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అధికారికంగా నిర్వహించడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిజాం ఆనవాళ్లను పూర్తిగా చేరిపివేయాలని, అందులో భాగంగా నిజామాబాద్ పేరును ఇందూర్ జిల్లాగా పేరు మార్చాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమానికి ఉపిరి పోసిన ఉస్మానియా యూనివర్సిటీ, నిజాం కళాశాల పేర్లు మార్చి నిజాంకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు అర్పించిన తెలంగాణ బిడ్డల పేర్లు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోళ్ల లక్ష్మి నారాయణ, బీజేపీ నాయకులు న్యాలం రాజు, జిల్లా ఉపాధ్యక్షులు పాలేపు రాజు, జిల్లా కార్యదర్శి జ్యోతి , జిల్లా బీజేపీ నాయకులు,బీజేపీ మండల అధ్యక్షులు,నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

