హైదరాబాద్, బతుకమ్మ : సాయుధ పోరాట స్ఫూర్తితో నిన్నటి నియంత పాలనను పక్కన బెట్టామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రపంచ ఉద్యమాల్లో సువర్ణాక్షరాలతో లిఖించదగిన పోరాటం మనదని, ప్రజలే రాసుకున్న పోరాట చరిత్ర మనదన్నారు. హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్ లో నిర్వహించిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంతో జాతీయ జెండాను ఆవిష్కరించి సీఎం ప్రసగించారు. సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవిల పాత్ర ఎనలేనిదన్నారు. త్వరలో రాష్ట్ర విద్యావిధానం తీసుకొస్తామన్నారు.
గోదావరి, కృష్ణా నదిజలాలపై న్యాయ పోరాటం చేస్తాం
గోదావరి, కృష్ణాజలాలపై న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నాం. 904 టీఎంసీల సాధనకు ట్రైబ్యునల్ ఎదుట బలమైన వాదనలు వినిపిస్తామన్నారు. హైదరాబాద్ నగరాన్నిగేట్ వే వరల్డ్ గా తీర్చిదిద్దుతామన్నారు. 2047 నాటికి మన రాష్ట్రం 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మారేందుకు ప్రణాళికలు వేస్తున్నాం. తెలంగాణ అంటేనే పోరాటాలు, త్యాగాలకు వేదిక అన్నారు. యువత పాలిట శాపంగా మారిన డ్రగ్స్ సమస్యను అరికడతామన్నారు. త్వరలో మెట్రో విస్తరణ పనులు ప్రారంభిస్తామన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు అభివృద్ధిలో సూచిక కానుందని, ఇందులో భాగంగా 12 రేడియల్ రోడ్ల నిర్మాణం చేపడుతామన్నారు. అలాగే తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా శాసన సభ సమీపంలోని అమరవీరుల స్థూపం వద్ద త్యాగధనులకు సీఎం రేవంత్ పుష్పాంజలి ఘటించి, నివాళి అర్పించారు.


