- పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా ప్రజలు నిబంధనలు తూచ తప్పకుండా పాటించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. విగ్రహాల ప్రతిష్టాపన:- ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా విగ్రహాలను ప్రతిష్టించరాదు. ముఖ్యంగా జనరద్దీగా ఉండే ప్రాంతాలు, పార్కులు, ఐలాండ్, ప్రభుత్వ భవనాలు లాంటి చోట్ల ఎటువంటి విగ్రహాలను ఏర్పాటు చేపట్టరాదు. విగ్రహాల ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ ఆద్వర్యంలోని కమిటీ యొక్క అనుమతులు తప్పనిసరిగా పొందవలసి ఉంటుందని తెలిపారు.
శబ్ద కాలుష్యం నియంత్రణ:- ఎక్కువశబ్దంతో డి.జే లను ఏర్పాటుచేయరాదని, ఇలా చేయడం వల్ల దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడే వృద్ధులు, చిన్న పిల్లలు, మహిళలు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని తెలియజేశారు. రెసిడెన్షియల్ స్థలంలో, కమర్షియల్ స్థలాల్లో రాత్రి సమయంలో 55 డెసిబెల్స్ సౌండ్ వాడాలని రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు డి.జే ల సౌండ్ సిస్టం పూర్తిగా నిషేదం గలదు. పోలీసుల అనుమతి తప్పనిసరి తీసుకోవాలని సూచించారు.
ఊరేగింపులు, సభల నిర్వహణ:- ఊరేగింపులు, బహిరంగ సభల్లో పరిమితులకు మించిన ధ్వని శబ్దం ఉత్పత్తి చేసే డి. జేలు. సౌండ్ సిస్టంలు నిజామాబాద్ కమిషనరేటు పరిధిలో నిషేదం గలదు. ఎవరైనా సభలు, సమావేశాలు జన సంచార ప్రదేశాల్లో లౌడ్ స్వీకర్లు పెట్టాలని భావిస్తే సంబంధిత అధికారుల నుండి ముందస్తుగా అనుమతి తీసుకోవాలి. 500 మందితో కూడిన సమావేశాలు లేదా సభలు నిర్వహించాలని భావిస్తే సంబంధిత అసిస్టెంటు పోలీస్ కమిషనర్ అనుమతి తప్పనిసరి 500 మంది కంటే ఎక్కువ జనాలతో కూడిన కార్యక్రమనికి 72 గంటల ముందుగా పోలీస్ కమిషనర్ అనుమతి తీసుకోవాలన్నారు.
సార్వజనిక ప్రదేశాల్లో నియమాలు:- మాల్స్, సినిమా ధియేటర్స్, హోటల్స్, ఎగ్జిబిషన్, బిజినెస్ ప్రదేశాల వద్ద ప్రజల కోసం సెక్యూరిటి నిబంధనలు తప్పనిసరి పాటించాలి. ప్రతీ ఒక్కరు క్యూ పద్దతిని తప్పనిసరి పాటించాలని తెలిపారు.
డ్రోన్ల వినియోగం పై ఆంక్షలు:- డ్రోన్ల వాడకం వలన ఎక్కువ ప్రమాదాలు పొంచి ఉన్న నేపద్యంలో నియంత్రణ చర్యలు తీసుకోవడం జరగుతుందని, ఈ డ్రోన్ల ఉపయోగం వలన జనజీవనానికి విఘాతం కలగడమే కాకుండా శాంతి భద్రతలకి విఘాతం వాటిల్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ,ఎవరయినా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రారంభించదలచినచో ముందస్తుగా సంబంధిత ప్రభుత్వ సంస్థలు, పోలీసు మరియు ఏవియేషన్ అధికారుల నుండి క్లియరెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.
నకిలీ గల్ఫ్ ఏజెంట్ల నుండిఅప్రమత్తం:- జిల్లాలో నకిలీ గల్ఫ్ ఏజెంట్లకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పాస్ పోర్టు, వీసా, రవాణా, టూరిస్ట్ తదితర సేవలు కల్పిస్తామని మాయమాటలు చెప్పి చాలా మంది గల్ఫ్ ఏజెంట్లు అనదికారికంగా వ్యాపారాలు నిర్వహిస్తూ,అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. కావున జిల్లా ప్రజలు గల్ఫ్ ఏజెంట్లకు తమ ఇల్లు అద్దెకు ఇచ్చే ముందుజాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు. అటువంటి వారు అద్దెకు వస్తే ముందస్తుగా వారి సమాచారాని సంబంధిత పోలీసు స్టేషన్ వారికి తెలియజేయండి. ఎవరైనా అనుమానస్పదంగా కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
” ఎ ” సర్టిఫికెట్ ఉన్న సినిమాల వీక్షణం:- నిజామాబాద్ జిల్లాలో ” ఎ ” (పెద్దలు) సర్టిఫికేట్ పొందిన సినిమాలను మైనర్లు చూడటానికి ధియేటర్లను అనుమతించరాదని పేర్కొన్నారు.
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం నిషేధం:- బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వ్యక్తులు నిజామాబాద్ వీదుల్లో చట్టాన్ని గౌరవించే పౌరుల పట్ల ముఖ్యంగా మహిళలు, పిల్లల పట్ల అసభ్యకరమైన వికృత, అసభ్యకరమైన ప్రవర్తన ను ప్రదర్శిస్తున్నట్లు నివేధికలు సూచిస్తున్నాయి. సాధారణంగా రోడ్డు వినియోగదారులకు ముఖ్యంగా మహిళలు మరియు పిల్లలకు చికాకు మరియు ఆటంకము కలిగించి ప్రజా ప్రశాంతతకు దారితీస్తుంది. కావున బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడాన్ని నిషేధిస్తూ ఆదేశాలు జారీచేయడం జరిగిందని తెలిపారు.
పైన తెలియజేసిన నిబంధనలను ఎవ్వరయిన అతిక్రమించిన యెడల వారిపై సంబంధిత చట్టాల ప్రకారం తగు చర్యలు తీసుకుంటామన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేటు పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లోని పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.ఓ లకు, ఎస్.ఐ లకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, అధికార ఉత్తర్వులను జారీచేశారు. ఈ ఉత్తర్వులు అక్టోబర్ 1నుంచి 15తేదీ వరకు అమలులో ఉంటాయని తెలిపారు.