- ఆగని అక్రమ ఇసుక రవాణా
- వే బిల్లు పత్రంలో సమయం దాటినా కూడా ఇసుక అక్రమ రవాణా
- పట్టించుకోని అధికారులు
రుద్రూర్, బతుకమ్మ: ఇసుక అక్రమ రవాణాకు అడ్డులేకుండా పోయింది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా అక్రమార్కులు ఇసుక దందాను జోరుగా కొనసాగిస్తున్నారు. పొతంగల్ గ్రామ శివారులోని మంజీరా నది, సుంకిని, కొడిచర్ల నుంచి పెద్ద ఎత్తున ఇసుకను ట్రాక్టర్లలో అక్రమంగా రవాణా చేస్తున్నారు. గురువారం టిఎస్16ఈ ఎన్7909, టిజి 16 1422 ట్రాక్టర్లకు నే బిల్లు పత్రంలో ఉదయం 10:20 నుండి మధ్యాహ్నం 12:20 వరకు సమయం ఉంటే సాయంత్రం 6.30 సమయంలో కూడా ఇసుకను ట్రాక్టర్లలో అక్రమంగా తరలిస్తున్నారు. పలువురు అక్రమార్కులు ఇష్టారాజ్యంగా ఇసుకను తోడేస్తు మూడు పువ్వులు, ఆరు కాయలుగా ఇసుక దందాను జోరుగా కొనసాగిస్తున్నారు. ఇసుక అక్రమంగా తరలిస్తున్నా అధికారులు మాత్రం తమకేమిలే అన్నచందంగా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అభివృద్ధి పనుల పేరిట పర్మిషన్ ముసుగులో ఒక్కో వే బిల్లుపై ఏడెనిమిది ఇసుక ట్రాక్టర్లను తరలిస్తున్నారని, ఇసుక వ్యాపారులు ఇసుకను రహస్య ప్రాంతాలలో డంప్ చేసి రాత్రి వేళల్లో రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్నారని పలు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఇసుక వ్యాపారులు ఇంత పెద్ద మొత్తంలో సంపాదిస్తున్నా ప్రభుత్వానికి మాత్రం సంబందిత శాఖ అధికారులు వెంటనే స్పందించి ఇసుక అక్రమ వేలల్లో కూడా ఆదాయం రావడం లేదని తెలుస్తోంది. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు.

