. . . 21వ డివిజన్ కార్పొరేటర్ పంచ రెడ్డి లలితా చరణ్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
సమగ్ర ఓటర్ల సవరణ జాబితా ప్రక్రియ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి పూర్తి అవగాహనతో వ్యవహరించాలని 21వ డివిజన్ కార్పొరేటర్ పంచ రెడ్డి లలితా చరణ్ సూచించారు. శుక్రవారం 21వ డివిజన్లో నిర్వహించిన ఎస్ఐఆర్ సర్వే కార్యక్రమంలో నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్తో కలిసి కార్పొరేటర్ లలితా చరణ్ పాల్గొని ఓటర్లకు ఎస్ఐఆర్ ప్రక్రియపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డివిజన్లోని సీనియర్ అడ్వకేట్ కృపాకర్ రెడ్డికి బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్ఓ) ద్వారా ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన వివరాలతో కూడిన సమాచార పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ లలితా చరణ్ మాట్లాడుతూ, ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రజలు నిర్లక్ష్యం వహిస్తే ఓటర్ల జాబితాలో పేరు తొలగిపోయే అవకాశం ఉందని తెలిపారు. ప్రతి పౌరుడు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందేందుకు ఓటు హక్కు ఎంతో ముఖ్యమని, ఓటర్ గుర్తింపు దేశంలోని ప్రాథమిక గుర్తింపుల్లో ఒకటని పేర్కొన్నారు. 21వ డివిజన్ ప్రజలందరూ తమ వివరాలను ఎస్ఐఆర్ సర్వే అధికారులకు తప్పనిసరిగా అందించాలని ఆయన కోరారు. 18 సంవత్సరాలు నిండిన కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ కార్డులోని వివరాల సవరణ, రెండు చోట్ల ఓటు ఉన్నట్లయితే సంబంధిత వివరాల సమర్పణ, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి సమాచారం, అలాగే మరణించిన ఓటర్ల వివరాలను అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో ఏవైనా సమస్యలు ఎదురైతే తమను సంప్రదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రత్యేక అధికారి ప్రశాంత్, వార్డ్ ఆఫీసర్ ఐశ్వర్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు షోయబ్, బూత్ లెవల్ ఆఫీసర్లు, డివిజన్ జవాన్ తదితరులు పాల్గొన్నారు.
