. . . నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
డ్రగ్స్ నిర్మూలనలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని, యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడటం అందరి బాధ్యతని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయిచైతన్య అన్నారు. శుక్రవారం నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్, ఐఎంఏ డాక్టర్స్ సహకారంతో డ్రగ్స్ నియంత్రణ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన 2కే రన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ చిన్న చిన్న మంచి అలవాట్లతోనే సమాజంలో పెద్ద మార్పు తీసుకురావచ్చని అన్నారు. డ్రగ్స్ సమస్య కొత్తది కాదని, దేశాన్ని బలహీనపర్చేందుకు శత్రు దేశాలు యువతను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ వ్యాప్తిని ప్రోత్సహిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

దేశ బలం యువతేనని, వారిని మత్తు పదార్థాలకు బానిసలుగా మార్చే కుట్రలను ప్రతి ఒక్కరూ అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ కు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే 1908 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా పోలీసులకు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతామని తెలిపారు. డ్రగ్స్ నియంత్రణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా నిధులు వెచ్చిస్తున్నాయని, ఈ సమస్య లేకుంటే ఆ నిధులను విద్య వంటి అభివృద్ధి రంగాలకు వినియోగించే అవకాశం ఉండేదని చెప్పారు. రానున్న రెండు నుంచి మూడు నెలల పాటు జిల్లాలోని అన్ని పాఠశాలలు, ఇంటర్మీడియట్ కళాశాలలు, ప్రొఫెషనల్ కళాశాలల్లో విస్తృత స్థాయిలో డ్రగ్స్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ సే నో టూ డ్రగ్స్ – సే ఎస్ టూ లైఫ్ అనే సందేశాన్ని సమాజంలోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకుని కృషి చేయాలని పోలీస్ కమీషనర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ కవిత రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి డ్రగ్స్ నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. పోలీస్ శాఖలో ఈగల్ బృందం డ్రగ్స్ నియంత్రణ కోసం నిరంతరం పనిచేస్తోందని చెప్పారు. అనంతరం సంతోష్ కుమార్ విద్యార్థులు, యువతతో కలిసి డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణ ప్రతిజ్ఞ చేయించారు.

డ్రగ్స్ నియంత్రణ కోసం పోలీస్ కళాబృందం చేసిన నాటిక విద్యార్థులను ఎంతో ఆకట్టుకున్నది. 2కె రన్ కార్యక్రమము పోలీస్ కమిషనర్ జెండా ఊపి ప్రారంభించిన అనంతరం జిల్లా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నుండి ప్రారంభమై రైల్వే కమాన్ – పోలీస్ పరేడ్ గ్రౌండ్ – ఎన్టీఆర్ చౌరస్తా – ఆర్ అండ్ బి ఆఫీస్ – రైల్వే స్టేషన్ – జిల్లా ఫైర్ స్టేషన్ – పాత కలెక్టరేట్ గ్రౌండ్ వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (అడ్మిన్) ఎన్.శుభం ప్రకాష్, జిల్లా ఇన్ కమ్ టాక్స్ ఆఫీసర్ ఐశ్వర్య, ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ విశాల్, నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్లు దర్శన్ సింగ్, శిరీష్ కుమార్, హితేన్ బిమాని, రజనీకాంత్, శ్రీనివాస్ రెడ్డి, డి వై ఎస్ ఓ పవన్ కుమార్, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, సీఐలు, ఎస్.ఐ లు పోలీసు సిబ్బంది, పోలీస్ కళాబృందం, నవ్య భారతి గ్లోబల్ పాఠశాల విద్యార్థులు, మెడికల్ కాలేజ్ విద్యార్థులు, ఎన్ సిసి క్యాండిడేట్స్ వివిధ కళాశాల పాఠశాలల విద్యార్థులు, ప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

