. . . ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో అందరినీ భాగస్వాములు చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు సూచించారు. ఈ నెల 12వ తేదీన నూతనంగా ఎన్నికైన సర్పంచులు, మున్సిపల్ వార్డు సభ్యులు, చైర్మన్లు, మేయర్లకు నిర్వహించే శిక్షణా కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, 99 రోజుల ప్రగతి ప్రణాళిక కార్యాచరణపై వారికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని అన్నారు. ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 12న నూతనంగా ఎన్నికైన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు నిర్వహించే శిక్షణా కార్యక్రమంపై సీ.ఎస్ రామకృష్ణారావు మంగళవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్, మున్సిపల్ పరిపాలన కార్యదర్శి టి.కె.శ్రీదేవి, సెర్ప్ సీఈఓ దివ్య, ప్రణాళికా శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్ లు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సి.ఎస్ మాట్లాడుతూ, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు సమన్వయంతో పని చేస్తేనే ఉత్తమ ఫలితాలు వచ్చి ప్రభుత్వ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలవుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే ఉటంకిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రజలకు ఏ విధంగానైతే ప్రామాణికమైన ఫలితాలు అందుతాయో, ఆ కోణంలో ఈ శిక్షణా కార్యక్రమం నిర్వహించాలని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్లాగ్ షిప్ కార్యక్రమాలు, కేంద్ర ప్రాయోజిత పథకాలు, ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యం, సామాజిక రుగ్మతల నివారణ, విద్యా, వైద్యం తదితర అంశాలపై స్పష్టమైన అవగాహన కలిగేలా ఉండాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 12,700 గ్రామ పంచాయతీలు, 110 మున్సిపల్ సంస్థలున్నాయని, వీటన్నింటిలో 15000 మంది ప్రజాప్రతినిధులున్నారని వివరించారు. ఈ శిక్షణ కార్యక్రమ ప్రారంభోత్సవానికి మంత్రులు, ఎం.పీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానించాలని సి.ఎస్ స్పష్టం చేశారు. జిల్లాలోని వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తెలిపేలా ఫోటో ప్రదర్శనను వేదిక వద్ద ఏర్పాటు చేయాలన్నారు. 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు ఫైళ్ల క్లియరెన్స్, పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు జిల్లా కలెక్టర్లను రామకృష్ణా రావు అభినందించారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్లకు ప్రత్యేకంగా గుర్తింపు కార్డులు ఇవ్వాలని సూచించారు. ఈ సందర్బంగా, ఇంచార్జి అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దిలీప్ కుమార్ మాట్లాడుతూ, నూతనంగా ఎన్నికైన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గురువారం రోజున శిక్షణ కార్యక్రమం నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశామని సీఎస్ దృష్టికి తెచ్చారు.

నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలోని మేయర్ డిప్యూటీ మేయర్ కార్పొరేటర్లతో పాటు, బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీల చైర్మన్లు, కౌన్సిలర్లకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్ లో, గ్రామ పంచాయతీల సర్పంచ్ లకు మరో వేదికలో మాస్టర్ ట్రైనర్లచే నిర్దేశిత అంశాలపై శిక్షణ ఇప్పిస్తామని అన్నారు. వారికి మెటీరియల్, గుర్తింపు కార్డులు అందించేలా చర్యలు తీసుకున్నామని, అందరి భాగస్వామ్యంతో జిల్లాలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేస్తామని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావు, సీపీఓ రతన్, మున్సిపల్ కమిషనర్ లు జాదవ్ కృష్ణ, ఉమా మహేశ్వర్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
