. . . పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని సీపీఎం డిమాండ్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని, లేని యెడల ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ.రమేష్ బాబు హెచ్చరించారు. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ శనివారం సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక నాందేవ్ వాడలో సిపిఎం కార్యాలయం నుండి హమాల్ వాడి చౌరస్తా వరకు ఆటోకు తాడుగట్టి పార్టీ కార్యకర్తలు ఆటోను లాగుతూ నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. అనంతరం రమేష్ బాబు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిన సందర్భంగా దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలను ఎట్టి పరిస్థితుల్లో పెంచబోమని ప్రజలకు హామీ ఇవ్వడం జరిగిందన్నారు. అంతకుముందే అమెరికా, ఇరాన్ మధ్య పెద్ద ఎత్తున యుద్ధం జరుగుతున్న సందర్భంలో ఆర్మోస్ దీవి నుంచి భారతదేశానికి క్రూడ్ ఆయిల్ ఓడరేవుల ద్వారా ఆటంకం లేకుండా సరఫరా జరిగిందని, మన దగ్గర సరిపడా క్రూడ్ ఆయిల్ నిలువలు ఉన్నాయని మాటలు చెప్పి, ఓట్లు అయిపోయిన అనంతరం నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రపంచంలో వచ్చిన ఆర్థిక సంక్షోభం మూలంగా క్రూడ్ ఆయిల్ యజమానులు, పెట్టుబడిదారులకు తలోగ్గి దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలను పెంచడానికి నిర్ణయించారని తెలిపారు. ఫలితంగా లీటర్ పెట్రోల్, డీజిల్ పైన మూడు రూపాయలు 20 పైసలు అదనపు భారం పెరిగిందని, ఫలితంగా సాధారణ మధ్యతరగతి ప్రజానీకం వాడే నిత్యవసర సరుకుల పైన ధరల భారం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. ప్రజలకు నష్టం చేసే పద్ధతుల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయాలు చేయటం వల్ల దేశంలో పేదరికం మరింత పెరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్ రాములు, నగర నాయకులు నల్వాల నరసయ్య, అనసూయమ్మ, అనిత, అంజయ్య, ఈవీఎల్ నారాయణ, ఉద్దవ్, రాజు, కార్యకర్తలు పాల్గొన్నారు.

