కామారెడ్డి, బతుకమ్మ: అంగన్ వాడీ సెంటర్లలో చిన్నారుల సంఖ్యను పెంచాలని, సూపర్ వైజర్లు, సీడీపీవోలు సెంటర్లను నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి అంగన్ వాడీ కేంద్రాన్ని మంగళవారం ఆయన తనిఖీ చేశారు. చిన్నారుల హాజరు పట్టికను, చిన్నారుల ఎత్తు(హైట్), బరువు వివరాలను పరిశీలించారు. తక్కువ బరువున్న చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని సూచించారు. కేంద్రంలోని పిల్లలకు ఆటపాటలు నేర్పించాలని, మంచి విద్యాబుద్దులు నేర్పించాలని సూచించారు. సెంటర్లకు పిల్లలను పంపించేలా వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం సెంటర్ వంట గదిని పరిశీలించారు. భోజనానికీ ముందు విద్యార్థులు వారి చేతులను శుభ్రం చేసుకునే పద్దతిని పరిశీలించారు. గ్రామంలో పారిశుధ్య కార్యక్రమాలు నిరంతరం నిర్వహించాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని పంచాయతీ కార్యదర్శి ని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్డీవో రంగనాథ్ రావు, జడ్పీ సీఈవో చందర్, సూపర్ వైజర్, సీడీపీవో తదితరులు పాల్గొన్నారు.

