. . . డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎయిర్ కమోడోర్ నర్సింగ్ సైలానీ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
బాధ్యతాయుతమైన, క్రమశిక్షణ కలిగిన యువతను తీర్చిదిద్దడంలో నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్సీసీ) కీలక పాత్ర పోషిస్తోందని ఏపీ – తెలంగాణ ఎన్సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎయిర్ కమోడోర్ నర్సింగ్ సైలానీ అన్నారు. 12 తెలంగాణ బెటాలియన్ ఆధ్వర్యంలో పోలీస్ ట్రైనింగ్ సెంటర్, జానకంపేటలో నిర్వహించిన వార్షిక శిక్షణా శిబిరం (సిఎటిసి – 4) ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎన్సీసీ శిక్షణ ద్వారా యువత లో నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, దేశభక్తి, నైతిక విలువలు పెంపొందుతాయని, సమాజ నిర్మాణంలో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగడానికి ఈ శిక్షణ ఎంతో దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా నిజామాబాద్ గ్రూప్ కమాండర్ కల్నల్ పి.ఎస్.సింగ్, కల్నల్ రాజేష్ కపూర్లతో కలిసి శిబిరంలో నిర్వహించిన వివిధ శిక్షణా కార్యక్రమాలు, ఫైరింగ్ రేంజ్ను ఎయిర్ కమోడోర్ నర్సింగ్ సైలానీ పరిశీలించారు. జూలై 1 నుంచి నిర్వహించిన ఈ కంబైన్డ్ యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్ లో భాగంగా టీ.ఎస్.సి., ఆర్.డి.సి.తో పాటు నిజామాబాద్ గ్రూప్ స్థాయి ఐ.డి.ఎస్.ఎస్.సి.శిబిరం కూడా నిర్వహించారు.

ఈ శిబిరంలో వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన 521 మంది క్యాడెట్లు, 11 మంది ఏఎన్ఓలు, 7 మంది జేసీవోలు, 14 మంది ఎన్సీవోలు, ఒక జీసీఐ పాల్గొన్నారు. ఎన్సీసీ ‘ఏ’, ‘బి’, ‘సి’ సర్టిఫికేట్ పరీక్షలకు హాజరయ్యే క్యాడెట్లకు ఈ శిక్షణా శిబిరంలో పాల్గొనడం తప్పనిసరి. శిబిరంలో మిలిటరీ శిక్షణ, డ్రిల్, ఆయుధ వినియోగం, రైఫిల్ ఫైరింగ్, మ్యాప్ రీడింగ్ వంటి అంశాలపై ప్రాక్టికల్ శిక్షణ అందించారు. శిక్షణలో ప్రతిభ కనబరిచిన క్యాడెట్లకు మెడల్స్, సర్టిఫికెట్లు ప్రదానం చేయడంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో లెఫ్టినెంట్ కల్నల్ సంజయ్ కుమార్ కౌల్, కల్నల్ రమేష్ సీరియల్, కల్నల్ అరుణ్ కుమార్, లెఫ్టినెంట్ కల్నల్ విష్ణు పి. నాయర్, సుబేదార్ మేజర్ రాచ్ పాల్ సింగ్, ట్రైనింగ్ జేసీవో అనూజ్ రానా, సునీల్, మహేందర్, భగత్, ఏఎన్ఓలు కెప్టెన్ బాబురావు, లెఫ్టినెంట్ రామస్వామి, నవీన్ కుమార్, ప్రమీల, ప్రవీణ్, శ్రీపాద్, తుకారాం, మధుబాబు, ముత్తెన్న, రోహిదాస్, నాగేశ్వర్, కార్యాలయ సిబ్బంది సూపరింటెండెంట్ వేణుగోపాల్, కిషన్, లక్ష్మణ్, సుధీర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

