. . . పాత ఉపాధి హామీ చట్టం కొనసాగించాలి
. . . ఉపాధి హామీకి కేంద్ర ప్రభుత్వం 90% నిధులు కేటాయించాల్సిందే
చందూర్, బతుకమ్మ :
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీ రామ్ జీ చట్టాన్ని ఉపసంహరించుకొని, పాత ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజల కోసం సీపీఎం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా బుధవారం చందూర్ మండల కేంద్రంలో ఉపాధి కూలీలు పనిచేస్తున్న ప్రాంతంలో ఏరియా కార్యదర్శి నన్నేసాబ్ తో కలిసి సమస్యలపై సర్వే చేపట్టారు.

ఉపాధి కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూలీ డబ్బులు రావడం లేదని, మెడికల్ కిట్టు, టెంటు, మంచినీరు సౌకర్యం లేదని కూలీలు తెలిపారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగా 40% నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని రాష్ట్రాలపై భారం మోపడం సిగ్గుచేటన్నారు. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు అప్పుల పాలై డబ్బులు లేక రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు జరపలేక సంక్షేమ పథకాలను తుంగలో తొక్కి ప్రజా సమస్యలను పట్టించుకోని సందర్భాలు ఉన్నాయని, అదే విధంగా పని దినాలు పెంచాలని రోజు కూలి 600 రూపాయలు ఇవ్వాలని అనేక రోజులుగా ప్రభుత్వాన్ని అడుగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులను పెంచకుండా ఉన్న ఉపాధిని హరించే పద్ధతుల్లో నిర్ణయాలు చేయటం సరైనది కాదని అన్నారు. నెలల తరబడి ఉపాధి కూలీల బిల్లును చెల్లించకపోతే పేద ప్రజల జీవనోపాధి ఎట్లా గడుస్తుందని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం చేసిన ఉపాధి హామీ చట్ట సవరణను ఉపసంహరించుకొని బడ్జెట్లో నిధులు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. ఉపాధి కూలీల బిల్లులు చెల్లించకపోతే ఈ నెల 23న ఎంపీడీఓ కార్యాలయం ఎదుట కూలీలతో కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధి కూలీలు శ్రీనివాస్, సాయిలు, మౌనిక, రాములు, గంగాధర్ లక్ష్మి, సంధ్య తదితరులు పాల్గొన్నారు.

