. . . యుద్ద ప్రాతిపదికన ధాన్యం తరలింపు చేపట్టాలి
. . . మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
బాల్కొండ, బతుకమ్మ :
రైతులు పండించిన ప్రతి గింజను తరుగు లేకుండా ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయాలని, వర్షాల ముప్పు పొంచి ఉన్నందున యుద్ధ ప్రాతిపదికన ధాన్యం తరలింపు చేపట్టాలని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కమ్మర్పల్లి మండలంలోని కొనసముందర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా కల్లాల వద్దకు వెళ్లి రైతులతో మాట్లాడి, ధాన్యం సేకరణలో ఎదురవుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. అనంతరం అక్కడి నుండే ఉన్నతాధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి పలు సూచనలు చేశారు. కొనసముందర్ కేంద్రంలో ధాన్యం నిల్వలు పెరిగిపోతున్నాయని, ప్రస్తుతం వస్తున్న రెండు లారీలు సరిపోవని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

వర్షా కాలం సమీపిస్తున్న తరుణంలో ధాన్యం తడవకుండా ఉండాలంటే లారీల సంఖ్యను పెంచి, కలెక్టర్ మాట ఇచ్చిన విధంగా ఈ రోజు నుండి 8 రోజుల్లోగా సేకరణ పూర్తి చేయాలని అన్నారు. నిజామాబాద్ లోని భువనేశ్వర్ రైస్ మిల్ వారు క్వింటాల్ కు 43 కిలోల చొప్పున అడుగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఇది నిబంధనలకు విరుద్ధమని 41.5 కిలోల చొప్పున మాత్రమే ధాన్యం తీసుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. బషీరాబాద్ కేంద్రంలో ఇప్పటివరకు కేవలం 20% ధాన్యం మాత్రమే లిఫ్ట్ అయిందని, మిగిలిన 80% ధాన్యం ఇంకా కల్లాల్లోనే ఉందని ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ కూడా లారీల రాకను పెంచాలని జేసీ కి సూచించారు. ధాన్యం లారీలకు ఆటంకం కలగకుండా చూడాలని, అవసరమైతే మట్టి లేదా పెండ తరలించే వాహనాల ను కుడా ధాన్యం రవాణాకే వాడాలని సూచించారు. ట్రాన్స్ పోర్టర్ల నిర్లక్ష్యంపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు.

