. . . జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
జుక్కల్, బతుకమ్మ :
ఉపాధి హామీ కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తామని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. మంగళవారం జుక్కల్ మండల కేంద్రంలోని ఆడిటోరియంను సందర్శించి, ఆడిటోరియం భవనాన్ని ప్రభుత్వ అవసరాలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేసి వినియోగంలోకి తీసుకురావడానికి తగిన చర్యలు చేపడతామని తెలిపారు. అనంతరం ఉపాధి హామీ కార్మికుల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం ప్రారంభమై 20 సంవత్సరాలు పూర్తయ్యాయని, గ్రామీణ పేద కుటుంబాలకు ఈ పథకం ఎంతో అండగా నిలిచిందని పేర్కొన్నారు. ఉపాధి కోసం పట్టణాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితులను తగ్గించి, గ్రామాల్లోనే ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా లక్షలాది కుటుంబాల జీవనోపాధి మెరుగుపడిందని తెలిపారు. అలాగే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గించి నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోందని విమర్శిస్తూ, పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని, ప్రజలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సావిత్రి సాయ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రమేష్ దేశాయ్, ఉపాధి కూలీలు తదితరులు పాల్గొన్నారు.
