. . . రోడ్లపై పశువులు సంచరించకుండా చర్యలు చేపట్టాలి
. . . కలెక్టర్ భవేష్ మిశ్రా
. . . డంపింగ్ యార్డు సందర్శన
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ఇంటింటికి తిరుగుతూ చెత్తను సేకరించే ప్రక్రియను పకడ్బందీగా పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ భవేష్ మిశ్రా సూచించారు. రోడ్లపై ఎక్కడబడితే అక్కడ పశువులు సంచరించకుండా తక్షణ చర్యలు చేపట్టాలని నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ ను ఆదేశించారు. నాగారం శివారులోని డంపింగ్ యార్డును కలెక్టర్ గురువారం సందర్శించారు. నగర పాలక సంస్థ పరిధిలో రోజువారీగా ఇంటింటికీ తిరిగి సేకరించే చెత్తను డంపింగ్ యార్డు వద్ద నిలువ చేస్తున్న తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చెత్తను ఆయా విభాగాల వారీగా వేరు చేస్తూ, ఎరువులు, ఇతర అవసరాల వినియోగం కోసం యంత్రాల సహాయంతో శుద్ధి చేస్తున్న విధానాన్ని పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ప్రతిరోజు సగటున ఎంత పరిమాణంలో చెత్తను శుద్ధి చేస్తున్నారు, ఎరువును ఎవరికి అందజేస్తున్నారు తదితర వివరాలను ఆరా తీశారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించేలా చర్యలు తీసుకోవాలని, తద్వారా బయో మైనింగ్ సులభం అవుతుందని అన్నారు. వ్యర్ధాలను శుద్ధి చేస్తూ కంపోస్ట్ తయారీ కోసం ప్రతిపాదించిన మేరకు వేస్టేజ్ ప్రాసెస్సింగ్ యంత్రాల ద్వారా శుద్ధి ప్రక్రియ జరిపించాలన్నారు. నగరంలో ప్రధాన మార్గాలలో రహదారులపై ఎక్కడబడితే అక్కడ ఆవులు, ఇతర పశువులు సంచరిస్తుండడం వల్ల ప్రజలు, ప్రత్యేకించి వాహన చోదకులు ప్రమాదాల బారిన పడే ప్రమాదం ఉందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని పశువులు రోడ్లపై సంచరించకుండా తగిన చర్యలు తీసుకోవాలని, రోడ్లపై తిరిగే పశువులను గోశాలకు తరలించాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఇతర అధికారులు ఉన్నారు.

