
. జాతీయ ఓటరు దినోత్సవంలో కలెక్టర్ పిలుపు
నిజామాబాద్,బతుకమ్మ : ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు హక్కు పునాది అని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. ఓటు హక్కు విలువను గుర్తెరిగి ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. 15వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ అధ్యక్షత వహించగా, జిల్లా అటవీ శాఖ అధికారి వికాస్ మీనా ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తన సందేశాన్ని వినిపించారు. ఎన్నికల్లో క్రమం తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకుంటున్న 80 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు నాగుల సాయమ్మ, కొట్టూర్ ఇందిరా, అవధూత భూమయ్య, మెరుగు ఒడ్డెమ్మ, అంకం సుశీల, వై.నర్సయ్యలను ఘనంగా సన్మానించారు. అదేవిధంగా కొత్తగా నమోదైన యువ ఓటర్లు నబీలా నూరిన్, లోకేష్ గౌడ్ అంబటి, షేక్ సుమేర్, సయ్యద్ అబ్దుల్ రెహమాన్, అబ్దుల్ ఇర్ఫాన్, రాచర్ల భవన్ కుమార్ లకు కొత్త ఓటరు ఐ.డీలను అందించి సత్కరించారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన పోటీలలో గెలుపొందిన విద్యార్థిని, విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ట్రెయినీ కలెక్టర్ సంకేత్ కుమార్, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, జిల్లా స్వీప్ అధికారి సురేశ్ కుమార్, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, విద్యార్థినీవిద్యార్థులు, ఎన్ సీ సీ కేడెట్లు, పెద్ద సంఖ్యలో ఓటర్లు పాల్గొన్నారు.
