. . . టెండర్లు పూర్తయిన పనులు ఎందుకు ప్రారంభించడం లేదు
. . . కాంట్రాక్టర్ నిర్లక్ష్యం చేస్తే బ్లాక్ లిస్ట్ లో పెట్టండి
. . . కమిషనర్ దిలీప్ కుమార్ తో కలిసి పర్యవేక్షించిన ఎమ్మెల్యే ధన్ పాల్…
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ:
నిజామాబాద్ నగరంలోని గంజ్ కమాన్ వద్ద గత కొన్ని రోజులుగా నెలకొన్న డ్రైనేజీ సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందని ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. టెండర్లు పూర్తయిన పనులు ఎందుకు ప్రారంభించలేదని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ ను ప్రశ్నించారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం చేస్తే బ్లాక్ లిస్టులో వేయాలన్నారు. వచ్చే మూడు రోజుల్లో పనులు పూర్తి కావాలని ఆదేశించారు. గురువారం నగరంలోని మార్వాడి గల్లీ, మిర్చి కాంపౌండ్ వద్ద లీకైన పైప్ లైన్ ను మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్, పబ్లిక్ హెల్త్ డీఈ శ్రీకాంత్ తో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…గత మూడు రోజులుగా మంచినీటి పైప్ లైన్ లీకేజీకి గురైందని, దీంతో మురికి నీరు కలుషితమై నలాల్లోకి వస్తున్నాయన్నారు. మూడు రోజులుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న అధికారులు స్పందించకపోవడం తగదన్నారు. ఏళ్లుగా ఉన్న పాత లైన్ ను సర్వే చేపట్టి శాశ్వత పరిష్కారం చేపట్టాలన్నారు. నూతన పైప్ లైన్ వేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. వీలైనంత తొందరగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. సంబంధిత అధికారులు సైతం కార్పొరేటర్లకు, ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నారు. అలాగే మిర్చి కాంపౌండ్ లో చేతిపంపులు మరమ్మతులు చేయించి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. వేసవిలో తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఎమ్మెల్యే వెంట స్థానిక కార్పొరేటర్ బంటు ప్రీతి , కార్పొరేషన్ ఏఈ శ్రీకాంత్, సిబ్బంది ఉన్నారు.

