- ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్
గాంధారి, బతుకమ్మ : భారత మాజీ ప్రధాని డా.మన్మోమన్ సింగ్ మరణం బాధాకరమని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. గాంధారీ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ దేశాన్ని ఆర్థికంగా కొత్త పుంతలు తొక్కించిన నేత మన్మోహన్ సింగ్ అని అన్నారు. భారత దేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలకు ఆద్యులలో ఆయన ఒకరని తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా, యూజీసీ ఛైర్మన్ గా విశిష్ట సేవలందించిన ఆయన ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారని తెలిపారు. మన్మోహన్ సింగ్ హయాంలో చేపట్టిన సంస్కరణల వల్ల మన ఆర్థిక వ్యవస్థ కొత్త పుంతలు తొక్కిందన్నారు. ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమైనవి అని తెలిపారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎటువంటి సమస్య లేకుండా నడిపిన సమర్థ నాయకుడు మన్మోహన్ సింగ్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులోనూ కీలక పాత్ర పోషించి మన రాష్ట్ర ఆవిర్భావానికి కృషి చేసిన మహానుబావుడని తెలిపారు. విద్యా హక్కు చట్టం, సమాచార హక్కు చట్టం, ఆహార భద్రత చట్టం, ఉపాధి హామీ చట్టం వంటి కీలక నిర్ణయాలు ప్రధాని మన్మోహన్ సింగ్ కాలంలోనే అమల్లోకి రాగా… అవి నేటికీ ఉపయోగపడుతున్నాయని తెలిపారు. నేడు భౌతికంగా మన్మోహన్ సింగ్ మనకి దూరమైన ఆయన ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు కాంగ్రెస్ కార్యకర్తలందరం పునరంకితమవుతాం అని తెలిపారు.
