- కబ్జాదారుల చేతిలో రుద్రూర్ చెరువు
రుద్రూర్, బతుకమ్మ: గత రెండు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు నిజామాబాద్ జిల్లా రుద్రూర్ చెరువు ప్రమాదపుటంచుకు చేరింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు సుమారు 20 అడుగుల లోతు గల రుద్రూర్ చెరువు నీటి ఉదృతితో ప్రమాద స్థాయికి చేరుకుంది. చెరువులో నీళ్లు నిండే సూచికగా ఏర్పాటు చేసిన చేప పూర్తిగా మునిగి పోయింది. చెరువు పూడిక తీయక పోవడంతో చెరువులో నీళ్లు ఇట్టే వచ్చి చేరుతున్నాయని స్థానికులు పేర్కొన్నారు. సుమారు 360 ఎకరాల్లో ఉన్న రుద్రూర్ చెరువు పూర్తిగా కబ్జాకు గురి కావడంతో పాటు ఇటు చెరువులో పూడుకుపోయిన మట్టిని తొలగించక పోవడంతో అటు కబ్జాదారుల పుణ్యమా అని చెరువు విస్తీర్ణం కాస్త కుచించుకు పోయి 200 ఎకరాలకు మిగిలింది. దీనికి తోడు చెరువులో మట్టి పుడుకుపోవడంతో వచ్చిన నీరు వచ్చినట్లు బయటకి వెళ్లడంతో పాటు రెండు పంటలకు సరిపడా నీళ్లు ఉడడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. చెరువు నిండిన సమయంలో నీటి సూచికను తెలిపే చేప సైతం పూర్తిగా మునిగి పోవడంతో రుద్రూర్ చెరువుకు ప్రమాదం పొంచి ఉందని రైతులు పేర్కొన్నారు.
- ఇరిగేషన్ ఏఈ శృతి వివరణ..
కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చెరువులోకి వరద నీరు వచ్చి చేరింది. ఈ చెరువుకు ప్రమాదం పొంచి ఉన్నందున ఈ విషయం పై ఇరిగేషన్ ఏఈ శృతికి చరవాణిలో వివరణ కోరగా, చెరువులోకి వరద నీరు చేరడం వలన తూములు విడుదల చేయడం జరిగిందని, అలుగులు పారుతున్నాయని, ఈ చెరువుకు ఎక్కడా కూడా ఎలాంటి ప్రమాదం లేదని ఆమె తెలిపారు.
- తహసీల్దార్ తారాబాయి వివరణ..
కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రుద్రూర్ చెరువులోకి వరద నీరు వచ్చి చేరి జలకళ సంతరించుకుంది. ఈ చెరువుకు ప్రమాదం పొంచి ఉన్నందున ఈ విషయంపై రుద్రూర్ తహసిల్దార్ తారాబాయికి చరవాణిలో వివరణ కోరగా, ఈ చెరువుకు ఎలాంటి ప్రమాదం లేదని, ఎప్పటికప్పుడు పోలీసు అధికారులు, రెవెన్యూ సిబ్బంది పర్యవేక్షిస్తున్నామని ఆమె తెలిపారు.
